విజయ్ పరువు పోకూడదనే త్రిషను అలా అన్నాను.. పార్తీబన్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-10 07:19:59  IST  )

తెలియక చేసేది పొరపాటు, కావాలని చేసేది తప్పు. అక్కడ జరిగింది కేవలం పొరపాటు మాత్రమే.

విజయ్ పరువు పోకూడదనే త్రిషను అలా అన్నాను.. పార్తీబన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు ఆర్. పార్తీబన్ ఇటీవల ‘గలాట్టా’ ఈవెంట్‌లో త్రిష, విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఓ పెళ్లి వేడుకల్లో విజయ్‌కి జంటగా కనిపించిన త్రిషను ‘‘కుందవై ఇంట్లోనే కుందవైలా ఉండాలి, బయటకు వస్తేనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించడంతో అంతా విమర్శలు చేశారు. ఇక త్రిష కూడా తనదైన స్టైల్లో స్పందించింది. మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మూర్ఖత్వమే అవుతుందని పార్తీబన్‌ను ఉద్దేశించి ఓ పోస్ట్ కూడా చేసింది. ఇక ఈ వివాదం రోజు రోజుకు పెరుగుతుండటంతో.... తాజాగా, పార్తీబన్ ఓ ఇంటర్వ్యూ ద్వారా వివరణ ఇవ్వడంతో పాటు తన ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకున్నారని అసలు విషయం అది కాదంటూ ఆయన స్పష్టం చేశారు.

‘‘తెలియక చేసేది పొరపాటు, కావాలని చేసేది తప్పు. అక్కడ జరిగింది కేవలం పొరపాటు మాత్రమే. నేను విజయ్, అజిత్ గురించి మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా త్రిష ఫోటో రావడంతో నేను షాక్ అయ్యాను. అప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ మాట అన్నాను తప్ప, ఆమెను నిందించాలనే ఉద్దేశం నాకు 100 శాతం లేదు. నేను ఎవరికీ బానిసను కాదు, డబ్బు కోసం ఎవరి గురించో తప్పుగా ప్రచారం చేసే వ్యక్తిని అంతకంటే కాదు’’ అని అన్నారు. విజయ్ రాజకీయ ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ పార్తీబన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారు, అది సామాన్యమైన విషయం కాదు. అయితే ఇటీవల ఒక పెళ్లి రిసెప్షన్‌కు త్రిష హాజరు కావడం వల్ల విజయ్ ఇమేజ్‌కు కొంత నష్టం వాటిల్లిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. విజయ్ ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయికి వచ్చారు.

త్రిష ఆ ఫంక్షన్‌కు రాకుండా ఉంటే బాగుండేది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ ఆవేదనతోనే ‘కుందవై ఇంట్లోనే ఉండాల్సింది’ అని అన్నాను. కానీ అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని వివరించారు. అలాగే తాను మహిళలను తక్కువ చేసే వ్యక్తిని కాదని పార్తీబన్ చెప్పుకొచ్చారు. ‘‘నాకు మాట్లాడాలని ఉంటే వేలు నాచియార్, మదర్ థెరిస్సా వంటి గొప్ప మహిళల గురించి మాట్లాడతాను. విజయ్ భార్య సంగీత పట్ల, ఆయన కుటుంబం పట్ల ఉన్న గౌరవంతోనే నేను అలా స్పందించాను. మహిళలు ఇంట్లోనే ఉండాలని నా ఉద్దేశం కాదు’’ అని క్లారిటీ ఇచ్చారు. త్రిష చేసిన ట్వీట్ తానూ చూశానని, తన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కారణం ఇదేనని పార్తీబన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా త్రిషను క్షమాపణలు కోరారు.

నోరుంది కదా అని ఏది పడితే అది వాగితే మూర్ఖత్వమే అవుతుంది.. పార్తీబన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన త్రిష

Next Story