మన సొంతవారు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం.. మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

ఈ కష్టకాలంలో విష్ణు, అతని అందమైన కుటుంబం దుబాయ్‌లో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

మన సొంతవారు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం.. మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: పశ్చిమ ఆసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు దుబాయ్‌లో ఉన్న పర్యాటకులను, భారతీయులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో, మా (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో చిక్కుకుపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మంచు విష్ణు తన భార్య, పిల్లలతో కలిసి విహారయాత్ర కోసం దుబాయ్ వెళ్లారు. అయితే, అక్కడ క్షిపణులు ఆకాశంలో దూసుకుపోతున్న దృశ్యాలను, పేలుళ్ల శబ్దాలను ఆయన స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ భయంకరమైన శబ్దాలకు తన చిన్న కుమార్తె ఐరా వణికిపోయిందని, అక్కడి పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వీడియో చూసిన అభిమానులు మంచు కుటుంబం భద్రతపై ఆందోళన చెందుతున్నారు. తాజాగా, ఈ విషయంపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘‘ఈ కష్టకాలంలో విష్ణు, అతని అందమైన కుటుంబం దుబాయ్‌లో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మన సొంత మనుషులు ప్రమాదంలో ఉన్నప్పుడు కలిగే ఆ బాధ వర్ణనాతీతం. మీరందరూ నా హృదయానికి ఎంతో దగ్గరైన వారు. దేవుని కృప మిమ్మల్ని కాపాడాలి. చివరికి ప్రేమే గెలవాలి’’ అని రాసుకొచ్చారు. మంచు లక్ష్మి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు, అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. మంచు విష్ణు కుటుంబంతో పాటు, అక్కడ ఉన్న భారతీయులందరూ క్షేమంగా స్వదేశానికి తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. యుద్ధం వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులు చూసి నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి విమాన సర్వీసులు నిలిచిపోవడంతో సెలబ్రిటీలతో పాటు వేలాది మంది పర్యాటకులు గల్ఫ్ దేశాల్లోనే ఉండిపోయారు.

Next Story