దయచేసి నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి.. రవి మోహన్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

చాలామంది మహిళలదే కరెక్ట్ అని అనుకుంటారు, కానీ అసలైన బాధితులు పురుషులే.

దయచేసి నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి.. రవి మోహన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు జయం రవి (రవి మోహన్) తన వైవాహిక బంధానికి స్వస్తి పలికినప్పటి నుండి సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చిన నేపథ్యంలో, నెటిజన్లు ఆయనను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడంతో తాజాగా ఆయన ఎమోషనల్ అవుతూ ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. విడాకుల విషయంలో సమాజం ఎప్పుడూ మహిళల వైపే మొగ్గు చూపుతుందని, కానీ కొన్నిసార్లు పురుషులు కూడా తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తారని రవి పేర్కొన్నారు. ‘‘చాలామంది మహిళలదే కరెక్ట్ అని అనుకుంటారు, కానీ అసలైన బాధితులు పురుషులే. నేను ప్రేమించిన వారి కోసం ఎంత చేశానో, ఎంత త్యాగం చేశానో ఏదో ఒక రోజు మీకే తెలుస్తుంది.

దయచేసి నన్ను నా దారిలో ప్రశాంతంగా బతకనివ్వండి. మీ చెడు ఆలోచనలను నాపై రుద్దకండి’’ అంటూ ఆయన వేడుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీసింది. కాగా.. రవి మోహన్ విడాకుల వెనుక సింగర్ కెనీషా ఉందంటూ గత కొంతకాలంగా వార్తలు షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, కలిసి నివసిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రవి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి కెనీషా హాజరుకావడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది. భార్యకు అన్యాయం చేసి మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం ఏంటని నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు. అయితే రవి మాత్రం ఈ వార్తలను పరోక్షంగా ఖండిస్తూ, తన వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని కోరుతున్నారు.

Next Story