Nindu Noorella Saavasam TV Serial: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పిల్లలు.. ఎక్కడికి వెళతారు?

by Chukka Sudharani |   (  Updated:2023-09-04 12:20:33  IST  )

రోజురోజుకు ఆసక్తికరమైన మలుపులతో కొనసాగుతోంది నిండు నూరేళ్ల సావాసం సీరియల్.

Nindu Noorella Saavasam TV Serial: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పిల్లలు.. ఎక్కడికి వెళతారు?
X

దిశ, సినిమా : రోజురోజుకు ఆసక్తికరమైన మలుపులతో కొనసాగుతోంది నిండు నూరేళ్ల సావాసం సీరియల్. ఒక ఆర్మీ లెఫ్టినెంట్ కుటుంబ కథతో సాగుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అరుంధతి చనిపోవడంతో కథలో ట్విస్ట్ ఇచ్చిన ఈ సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకుందాం. అమర్‌కు దగ్గరవ్వాలని మనోహరి పిల్లల కడుపు మాడ్చి నాటకమాడుతుంది. పిల్లల మీద ప్రేమతో తన తల్లి అన్న మాటలు పట్టించుకోవద్దని చెప్పగానే అమర్‌ను హత్తుకుంటుంది మనోహరి. అది చూసి షాకవుతుంది అరుంధతి. కానీ అమర్ మనోహరిని పక్కకు నెట్టి కంట్రోల్ అవమని చెప్పి అక్కడనుంచి వెళ్లిపోతాడు. తన ప్లాన్ వర్కౌట్ అవనందుకు ఫీలవుతుంది మనోహరి. పిల్లలకు ఇంకా టార్చర్ ఎలా పెంచాలా అని ఆలోచిస్తుంది.

స్కూల్లో జరిగిన విషయాలేవీ తండ్రి దగ్గర చెప్పకుండా అంతా బాగానే ఉందని అబద్ధం చెబుతారు పిల్లలు. అదేంటని అడిగిన అంజలితో.. చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు, పైగా డాడీ బాధపడతారు అని చెబుతుంది అమ్ము. ఎలాగైనా ఆ ఇంట్లో నుంచి కొడైకెనాల్ వెళ్లిపోవాలని నలుగురు కలిసి ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టే ఉదయం అలారం మోగడానికి ముందే లేచి స్కూల్‌కు రెడీ అవుతారు. అసలేం జరుగుతుందో అర్థం కాని మనోహరి ఆశ్చర్యపోతుంది. రాథోడ్ కంటే ముందే హాల్లోకి వచ్చి.. అమర్ తల్లిదండ్రులకు బాయ్ చెప్పి స్కూల్‌కు బయలుదేరుతారు. పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించి ఏంటని చిత్రగుప్తుడిని అడుగుతుంది అరుంధతి ఆత్మ. రాథోడ్ జీవితం తలకిందులు కాబోతోందని, తానేం చెప్పలేనని అంటాడు చిత్రగుప్తుడు.

అరుంధతి మంగళ సూత్రాన్ని పట్టుకుని ఆలోచిస్తున్న భాగమతిని దాన్ని మెడలో వేసుకోమని అంటుంది కరుణ. ఎంతచెప్పినా వినకుండా బలవంతపెట్టడంతో ఆ తాళిని మెడలో వేసుకుంటుంది భాగమతి. ఆ తాళి భాగీ మెడలో పడగానే అమర్, అరుంధతితో పాటు భాగమతి మనసులోనూ ఏదో అలజడి జరుగుతుంది. కొత్తగా వచ్చిన లెఫ్టినెంట్‌ను ఎలాగైనా కలిసి తన తండ్రి మెడికల్ ఫైల్ మీద సంతకం పెట్టించుకోవడానికి బయలుదేరుతుంది భాగీ. వచ్చేటప్పుడు సోపులు, షాంపూలు తీసుకురమ్మంటున్న కరుణతో.. అంతేనా వచ్చేటప్పుడు నలుగురు పిల్లలను తీసుకురమ్మంటావా అంటూ చిరాకుపడుతుంది భాగీ.

పిల్లల ప్లాన్ తెలియని రాథోడ్ వాళ్లని తీసుకుని స్కూల్‌కు బయలుదేరతాడు. కారు ఎక్కిన పిల్లలు తేడాగా మాట్లాడటంతో రాథోడ్‌కు ఏం అర్థం కాదు. కొంతదూరం వెళ్లాక పెన్ కొనుక్కోవాలని కారు దిగుతుంది అంజలి. ఒకరి తర్వాత ఒకరు నలుగురు వెళతారు. ఎంతసేపటికీ పిల్లలు తిరిగిరాకపోవడంతో రాథోడ్ కంగారు పడతాడు. బయటకు వెళ్లిన పిల్లలు ఎక్కడకు చేరుకుంటారు? పిల్లలు కనపడట్లేదని తెలిసిన అమర్ ఏం చేస్తాడు? అనేది తెలియాలంటే సెప్టెంబర్ 04న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!

Next Story