ఫస్ట్ పార్ట్ కంటే మరింత హింసాత్మకంగా ఉంటుంది.. ‘యానిమల్ పార్క్’ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

by Mallepaka Hamsa |

భారతదేశంలో సంచలనం సృష్టించిన ‘యానిమల్’ సినిమా ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

ఫస్ట్ పార్ట్ కంటే మరింత హింసాత్మకంగా ఉంటుంది.. ‘యానిమల్ పార్క్’ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
X

దిశ, సినిమా: భారతదేశంలో సంచలనం సృష్టించిన ‘యానిమల్’ సినిమా ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 13న జపాన్ థియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), అక్కడ మీడియాతో మాట్లాడుతూ సీక్వెల్‌పై భారీ హైప్‌ను క్రియేట్ చేశారు. ‘యానిమల్ పార్క్’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? కథ ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్నలకు సందీప్ క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్‌కు ‘యానిమల్ పార్క్’ అని పేరు పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని సందీప్ వివరిస్తూ.. ‘‘పార్ట్ 1లో ఒక యానిమల్‌ని చూశారు. కానీ సీక్వెల్‌లో అలాంటి మరిన్ని యానిమల్ క్యారెక్టర్లు ఉండబోతున్నాయి. ముఖ్యంగా అజీజ్ పాత్ర కూడా యానిమల్ లాంటిదే. ఒకేలా కనిపించే ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే భీకర పోరాటమే ఈ సినిమా. అందుకే ‘యానిమల్ పార్క్’ అనే టైటిల్ దీనికి పర్ఫెక్ట్‌గా సరిపోతుందని ఫీలయ్యాను.

నేను ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ (ప్రభాస్‌తో ‘స్పిరిట్’) పూర్తయ్యాక, 2027లో ఈ సీక్వెల్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. ఈ సినిమా మొదటి భాగం కంటే మరింత హింసాత్మకంగా, ఎమోషనల్‌గా ఉంటుందని ఆయన హింట్ ఇచ్చారు. ఇక రణ్‌బీర్ కపూర్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘నేను మళ్ళీ సందీప్ సెట్స్‌లోకి వెళ్లడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. పార్ట్ 1 షూటింగ్ సమయంలోనే సందీప్ దగ్గర పార్ట్ 2 గురించి పూర్తి స్పష్టత ఉంది. సీక్వెల్‌లో రణ్‌విజయ్ సింగ్‌తో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న అజీజ్ హక్ పాత్రలో కూడా నేనే నటిస్తున్నాను. మేమిద్దరం నిరంతరం సినిమా ఆలోచనల గురించి చర్చించుకుంటూనే ఉంటాం. వివిధ ఆలోచనలను చర్చిస్తూ ఉంటాం’’ అని పేర్కొన్నారు. రణ్‌బీర్ డబుల్ రోల్‌లో కనిపించనుండటం, అది కూడా ఇద్దరు ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడే క్రూరమైన పాత్రలు కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు రెట్టింపయ్యాయి.

Next Story