టాలీవుడ్ అగ్ర హీరోలపై ఐటీ ఫోకస్.. త్వరలో నోటీసులు?

by Disha Web Desk 2 |
టాలీవుడ్ అగ్ర హీరోలపై ఐటీ ఫోకస్.. త్వరలో నోటీసులు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర హీరోలకు త్వరలో ఐటీ నుంచి నోటీసులు జారీ కానున్నాయి. చిత్ర నిర్మాణ సంస్థల నుంచి అందుకున్న పారితోషికం వివరాలను రాబట్టాలనుకుంటున్నది. లెక్కల్లోకి రాకుండా కోట్లా రూపాయలు వేర్వేరు రూపాల్లో పేమెంట్స్ జరుగుతున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు భావిస్తున్నారు. ఐటీ రిటన్‌లతో పాటు వారి బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించే ప్రక్రియను త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు ఢిల్లీలోని ఐటీ వర్గాల సమాచారం. మైత్రీ మూవీస్ సంస్థపై ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ స్పెషల్ టీమ్ ఇటీవల రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన తర్వాత అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పుష్ప-2 చిత్ర నిర్మాణంతో మొదలైన చిక్కులు పలువురు టాప్ హీరోలకూ అంటుకోనున్నది.

సినిమాల నిర్మాణంలో హీరోలతో రెమ్యునరేషన్ విషయంలో కుదిరే అగ్రిమెంట్లు, వారికి చెల్లించే అడ్వాన్స్ పేమెంట్స్, ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలకు ఇచ్చిన కాంట్రాక్టు అమౌంట్ తదితరాలన్నింటిపై ఈ సోదాల సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు తెలిసింది. ఈ సోదాల్లో భారీ స్థాయిలో బ్లాక్ మనీ బైటపడినట్లు పేర్కొన్న ఐటీ వర్గాలు కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలపై మైత్రీ మూవీస్ కంపెనీ డైరెక్టర్లు సరైన వివరాలను చూపించలేకపోయారని పేర్కొన్నాయి. పుష్ప-2 చిత్రం కోసం హీరో అల్లు అర్జున్‌తో కుదుర్చుకున్న పేమెంట్ కాంట్రాక్టు, చేసిన చెల్లింపులు తదితరాలపైనా స్పష్టమైన వివరాలు రాలేదని గుర్తుచేశాయి.

క్యాష్ రూపంలో పేమెంట్స్ జరిగినట్లు కొన్ని రాతపూర్వక అంశాలు మైత్రీ మూవీస్ సంస్థపై సోదాల సందర్భంగా బహిర్గతమైనా వాటిపై కంపెనీ నిర్వాహకుల నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడమే ఇప్పుడు అగ్ర హీరోల మెడకు చుట్టుకోడానికి దారితీస్తున్నది. రానున్న రోజుల్లో ఏ హీరోకు నోటీసులు జారీ అవుతాయన్నది ఆసక్తికరం.

A lso Read..

బుల్లితెరలో విషాదం.. అగ్ని సాక్షి సీరియల్ హీరో ఆత్మహత్య


Next Story

Most Viewed