సింగిల్‌గా ఉంటే ఇష్టమొచ్చినట్లు రాస్తారా.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మీనా.. అసలేం జరిగిందంటే?

by Mallepaka Hamsa |

సింగిల్‌గా ఉన్నాను కదా అని నిజం తెలియకుండానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? మిమ్మల్ని ప్రశ్నించే వారు ఎవరూ లేరని అనుకుంటున్నారా?.

సింగిల్‌గా ఉంటే ఇష్టమొచ్చినట్లు రాస్తారా.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మీనా.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా(Meena) తన భర్త విద్యాసాగర్ మరణం తర్వాత కూతురు నైనిక బాధ్యతలను భుజాన వేసుకుని ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే, ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. గతంలో ఎన్నిసార్లు ఖండించినా ఈ పుకార్లు ఆగకపోవడంతో, తాజాగా మీనా తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ క్లారిటీ ఇచ్చారు. తన రెండో వివాహం గురించి వస్తున్న వార్తలపై మీనా స్పందిస్తూ.. ‘‘నా పెళ్లి గురించి వ్యాపిస్తున్న పుకార్లు నన్ను తీవ్రంగా బాధించాయి. నేను ఒక సెలబ్రిటీని, పైగా సింగిల్‌గా ఉన్నాను కదా అని నిజం తెలియకుండానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? మిమ్మల్ని ప్రశ్నించే వారు ఎవరూ లేరని అనుకుంటున్నారా?’’ అని ఘాటుగా ప్రశ్నించారు.

ఈ వార్తలు చూసినప్పుడు తనకు చాలా కోపం, చిరాకు వస్తాయని, వీటిని భరించడం తన వల్ల కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండే వ్యక్తిని అని, తన దృష్టి అంతా కేవలం మంచి విషయాల మీద, తన కూతురు భవిష్యత్తు మీద మాత్రమే ఉందని స్పష్టం చేశారు. చాలామంది సెలబ్రిటీలు చిన్న చిన్న విభేదాలకే విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో, భర్త చనిపోయినా ఆయన జ్ఞాపకాలతో బతుకుతున్న మీనా వంటి వారిని గౌరవించాల్సింది పోయి, ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మీనా ధైర్యంగా స్పందించడం పట్ల ఇండస్ట్రీలోని సహ నటీనటులతో పాటు నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె గొప్ప నటి మాత్రమే కాదు, అంతకంటే గొప్ప మనసున్న వ్యక్తి. ఆమె కష్ట కాలంలో ఉన్నప్పుడు ఓదార్చాల్సింది పోయి ఇలాంటి వార్తలు రాయడం సిగ్గుచేటు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మీనా సినీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం మీనా దృశ్యం-3 వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది.

Next Story