ట్రాఫిక్ నిబంధనలు తూచ్.. వారంలో 44,024 కేసులు

by  |
traffic rules
X

దిశ,తెలంగాణ బ్యూరో: రోడ్డు నిబంధనలు పాటించాలని ఇటు ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ, స్వచ్ఛంద సంస్థలు ఎంత అవగాహన కల్పించినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రమాదాల నివారణ కోసం తీసుకొస్తున్న ఏ చట్టాన్నైనా విధిగా పాటించాల్సిందే. అయితే హైదరాబాద్‌లో నిత్యం జరుగుతున్న ప్రమాదాల్లో అధికంగా హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కారణంగానే మృత్యువాత పడుతున్నట్లు గమనించారు. ఈ నేపథ్యంలో నగరవాసులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. చలాన్లు విధిస్తేనే వాహనదారుల్లో మార్పు వస్తుందని ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ వితౌట్ హెల్మెట్లు, రాంగ్ రూట్, అతి వేగం లాంటి వాటిని నివారించేందుకు కృషి చేస్తున్నారు.

నగరంలో పోలీసులు ఎంత పకడ్బందీగా ఉన్నా నిత్యం వేల సంఖ్యలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. స్వంచ్ఛంద సంస్థలూ అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లోనే నమోదైన కేసులను చూస్తుంటే వాహనదారుల్లో ఎంత నిర్లక్ష్యం ఉందో తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు రాచకొండ కమిషనరేట్‌లో 44,024 కేసులు నమోదయినట్లు పోలీసులు ప్రకటించారు. వీటిలో 26,035 మంది హెల్మెట్ లేకుండా రోడ్డెక్కిన్నట్లు తెలిపారు. వీటితో పాటు వితౌట్ సీట్ బెల్టు, వితౌట్ డ్రైవింగ్ లైనెస్స్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లు మరిన్ని కేసులు నమోదయ్యాయి.

అయితే వీటి ద్వారా రూ.1,38,67,500 జరిమానా విధించారు. వీరిలో కొందరిని కోర్టులో హాజరుపరచగా.. మరికొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తూ తరచూ దొరికితే వెంటనే వారి వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు డ్రైవింగ్ లైసెన్సును సైతం బ్లాక్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


Next Story