అదే నన్ను టీఆర్ఎస్‌లో చేరేలా చేసింది : మోత్కుపల్లి

by  |
అదే నన్ను టీఆర్ఎస్‌లో చేరేలా చేసింది : మోత్కుపల్లి
X

దిశ, హుజూరాబాద్ రూరల్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం కోసమే తాను టీఆర్ఎస్‌లో చేరానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కులరహిత సమాజం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయన్నారు. పంట పెట్టుబడి సాయం అందించడంతో పాటు వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దళితులకు చెందిన 40 ఎకరాల అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశాడని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆదాయం పెంచుకున్నాడే తప్పా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు దళిత బంధు రాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశానికే దిక్సూచి లాంటి దళిత బంధు పథకాన్ని చూసే టీఆర్ఎస్ పార్టీలో చేరానని మరోసారి స్పష్టంచేశారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఈటలకు ఓటు వేస్తే చెత్త కుప్పలో వేసినట్లేనని అన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఛైర్మెన్ పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed