ఆ పథకం పరిశ్రమలకు ఎంతో కీలకం : మదర్సన్ సుమీ

by  |
ఆ పథకం పరిశ్రమలకు ఎంతో కీలకం : మదర్సన్ సుమీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం ఎంతో ప్రోత్సాహకరమైనదని, భారత్‌లో ఉన్న అవకాశాలతో 2025 నాటికి తమ సంస్థ రూ. 2.66 లక్షల కోట్ల ఆదాయాన్ని సాధించేందుకు తోడ్పడుతుందని ఆటో కాంపొనెంట్ దిగ్గజం మదర్సన్ సుమీ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్ వివేక్ చాంద్ చెప్పారు. భారత్‌లో తయారీకి స్పష్టమైన అవకాశాలున్నాయని, అంతేకాకుండా భారత్‌లో తయారీని ప్రోత్సహించే చర్యలు అమలవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

‘భారత ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకం పరిశ్రమకు ఎంతో ఉపయోగం. రానున్న రోజుల్లో ఇదెంతో కీలకం కానుందని నమ్ముతున్నట్టు’ వివేక్ చాంద్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఆటో, ఫార్మా, టెలికాం, టెక్స్‌టైల్, సోలార్ వంటి రంగాలకు పీఎల్ఐ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీయ తయారీని పెంచేందుకు 10 కీలక రంగాలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందించనుంది. కాగా, ఐదేళ్ల కాలంలో మదర్సన్ సుమీ సంస్థ రూ. 2.66 లక్షల కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 75 శాతం ఆటోమోటివ్ రంగం నుంచి, 25 శాతం కొత్త విభాగాలైన ఏరోస్పేస్, లాజిస్టిక్స్, ఆరోగ్య, వైద్య విభాగాల నుంచి అందుకోవాలని నిర్దేశించింది.

Next Story

Most Viewed