పిల్లలకు విషమిచ్చిన తల్లి.. చివరికి తాను?

by  |

దిశ, హైదరాబాద్: కుటుంబ కలహాలు.. నిండు జీవితాలను బలిగొంటున్నాయి. చిన్నారులను చిదిమేస్తున్నాయి. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. పెద్దల క్షణికావేశం పిల్లల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తోంది. బిడ్డల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న తల్లిదండ్రులే.. కుటుంబ కలహాలతో ప్రాణ త్యాగాలకు సిద్ధపడుతూ.. పిల్లల ప్రాణాలను కూడా తీసేస్తున్నారు.

అచ్చం ఇటువంటి ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన గోపినాథ్.. ఎనిమిది ఏళ్ల క్రితం ప్రీతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం దంపతులు శామీర్‌పేట్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, కుటుంబ కలహాల కారణంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలోనే మంగళవారం కూడా గోపినాథ్, ప్రీతి మధ్య వివాదం తలెత్తింది. ఇక భర్తతో పోరు పడలేక విసుగుచెందిన ప్రీతి బుధవారం తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చింది. అనంతరం తాను కూడా తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషం తాగినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు కుమారులు మృతి చెందారు. తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఏది ఏమైనా.. భార్యభర్తల గొడవలు చివరకు బాధిత కుటుంబంలో విషాదాన్నే మిగుల్చుతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలకు పిల్లలు బలైపోవడం బాధాకరం.


Next Story

Most Viewed