విషాదం.. దేవులగూడాలో తల్లి, కొడుకు మృతి

by  |
Died-1
X

దిశ, తాండూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం దేవులగూడా సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. రెబ్బెన సీఐ సతీష్ కుమార్, ఎస్సై భవానీ సేన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం తెనుగుగూడకు చెందిన ముక్కెర రజిత, ఆమె కుమారుడు ముక్కెర గణేష్, ముక్కెర శ్రీకాంత్, పంబాల కృష్ణ, పంబా లక్ష్మిలు మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ఎల్లారం పోచమ్మ ఆలయానికి వెళ్లారు. పోచమ్మను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుని రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంటికి ఆటోలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఆటో దేవులగూడా సమీపంలోకి రాగానే రెబ్బెన నుంచి బెల్లంపల్లి వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను అతి వేగంగా ఢీకొంది. దీంతో ఆటో నుజ్జునుజ్జు కాగా ఆటోలో ఉన్న రజిత(30) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గణేష్ (5) ను చికిత్స నిమిత్తం రెబ్బెన పీహెచ్ సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మిగతా క్షతగాత్రులు కృష్ణ, లక్ష్మి, శ్రీకాంత్ లను మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

accident-2


Next Story