తెలంగాణలో మరో కొత్త వ్యాధి.. ‘వంద’పైనే కేసులు

by  |
తెలంగాణలో మరో కొత్త వ్యాధి.. ‘వంద’పైనే కేసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వ్యాధితో వణికిపోతున్న ప్రజలను బ్లాక్ ఫంగస్ మరింత భయపెడుతుంది. ఆక్సిజన్‌పై చికిత్సలు పొందిన వారిపై బ్లాక్ ఫంగస్ పంజావిసురుతుంది. ఇప్పటికే ఈ ఫంగస్‌తో నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తి చనిపోగా చెస్ట్ ఆసుపత్రిలో వందకు పైగా పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ సోకినట్టు సమాచారం. ఆక్సిజన్ సప్లై కోసం వినియోగించే హ్యూమిడిఫైర్లను నిత్యం శుభ్రం చేయకపోవడంతో మ్యూకోర్మైకోసిస్ అనే ఫంగస్ ఏర్పడి బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకుతుంది. బ్లాక్ ఫంగస్‌ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని డీఎంఈ రమేష్ రెడ్డి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేశారు.

కరోనా వ్యాధితో పోరాడి చచ్చిబతికామురా.. దేవుడా అన్ని ఊపిరి పీల్చుకుంటున్న వారి వెన్నులో వణకుపుట్టేలా బ్లాక్‌ఫంగస్ వ్యాధి భయపెడుతుంది. ఆక్సిజన్ బెడ్లపై చికిత్సలు పొందిన వారిని బ్లాక్ ఫంగస్ వ్యాధి వెంటాడుతుంది. గత 15 రోజుల నుంచి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా ప్రస్తుతం రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకితే 50% కంటే ఎక్కువగా మరణాలుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆక్సిజన్ వినియోగించిన వారికి బ్లాక్ ఫంగస్..

బ్లాక్ ఫంగస్ వ్యాధి ఎక్కువగా రోజుల తరబడి ఆక్సిజన్‌ను వినియోగించే వారికి సోకుతుంది. ఆక్సిజన్‌ను వినియోగించిన పేషెంట్లు ఊపిరి తీసుకొని గాలిని బయటకు వదులినప్పుడు హ్యూమిడిఫైయర్‌పై ముకోర్మైకోసిస్ అనే ఫంగస్ ఏర్పడుతుంది. దీనిని ఆసుపత్రి సిబ్బంది ఎప్పటికప్పుడు స్టెరైల్ వాటర్ ద్వారా శుభ్రపరచాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో కొవిడ్ పేషెంట్ల తాకిడి పెరగడంతో హ్యూమిడిఫైయర్లను శుభ్రపరచడంపై సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో రోజుల తరబడి పేరుకుపోయిన మ్యూకోర్మైకోసిస్ ఫంగస్ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి బ్లాక్ ఫంగస్ వ్యాధిని వ్యాప్తి చేస్తుంది. డయాబెటిస్​చికిత్సకు అధికంగా స్టెరాయిడ్స్​వినియోగించడం వలన కూడా ఈ బ్లాక్ ఫంగస్ సోకుతుంది.

బ్లాక్ ఫంగస్ లక్షణాలు..

కరోనా నుంచి కోలుకున్న వారికి రెండు మూడు రోజుల్లో బ్లాక్​ఫంగస్​లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోకి ప్రవేశించిన ఈ ఫంగస్ సైనస్‌లో చేరి ఆ తర్వాత కండ్లపై ఇది దాడి చేసి కంటి చూపు మందగించేలా చేస్తుంది. కండ్లకు చేరిన 24 గంటల్లోపే మెదడులోకి ప్రవేశించడం, బ్రెయిన్​డెడ్ కావడంతో పేషెంట్ చనిపోతున్నారు.

యాంటీ ఫంగల్ ట్రీట్‌మెంట్ అవసరం..

బ్లాక్ ​ఫంగస్ వ్యాధి సోకిన వారిని ప్రాథమిక దశలోనే గుర్తించి యాంటీ ఫంగల్ ట్రీట్‌మెంట్ చేయడం వలన పేషెంట్లను కాపాడవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించని వ్యాధి కాబట్టి భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. బ్లాక్ ఫంగస్ తీవ్రంగా ఉన్న వారికి యాఫోటెరిసన్​‘బీ’ వంటి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లను ఇచ్చి ప్రాణాలు కాపాడవచ్చని చెబుతున్నారు. అరుదుగా వినియోగించే ఈ మందుల కొరత ఉన్నందున చికిత్స కూడా పెద్ద సవాలుగా మారుతుంది. బ్లాక్ ఫంగస్ సోకిన రోగికి 21 రోజుల పాటు క్రమం తప్పకుండా యాఫోటెరిసన్​‘బీ’ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక డోసు ఇంజక్షన్‌కు రూ. 9,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

తక్షణ చర్యలపై డీఎంఈ ఆదేశాలు..

బ్లాక్ ఫంగస్ వ్యాధి నుంచి కొవిడ్ పేషెంట్లను కాపాడేందుకు డీఎంఈ రమేష్ రెడ్డి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరిండెంట్లను అలర్ట్ చేశారు. పేషెంట్లకు అమర్చిన హ్యూమిడిఫైయర్లను నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్టెరైల్డ్ వాటర్‌ను వినియోగించి ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని సూచించారు. ఫిల్‌లైన్‌లో10 మి.మి‌ పై వరకు నీరు ఉండేలా చర్యలు చేపట్టాలని రోజుకు రెండు సార్లు నీటి పరిమాణాలన్ని తనిఖీ చేయాలని చెప్పారు. హ్యూమిడిఫైయర్లలోని నీటిని ప్రతీ రోజు మారుస్తూ వారికోసారి ఆంటిసెప్టిక్ సొల్యూషన్‌లో వేసి శుభ్రం చేయాలని, ఎండలో ఆరబెట్టిన తరువాత పేషెంట్లకు వినియోగించాలని సూచించారు.


Next Story

Most Viewed