లక్షా 25 వేల మంది టీచర్ల సస్పెన్షన్

by  |
లక్షా 25 వేల మంది టీచర్ల సస్పెన్షన్
X

దిశ, ఫీచర్స్ : మయన్మార్‌లో పాలన మరోసారి సైన్యం చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తూ జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో చేరినందుకు ఆ దేశంలోని లక్షా ఇరవై ఐదు వేలకు పైగా టీచర్లను సస్పెండ్ చేసినట్టు మయన్మార్ టీచర్స్ ఫెడరేషన్ అధికారి వెల్లడించారు. నిరసనలో భాగంగా కొందరు టీచర్లు విధులు బహిష్కరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే ఈ సస్పెన్షన్ అమలులోకి రాగా, శనివారం వరకు మొత్తం 1,25,900 స్కూల్ టీచర్లు సస్పెండ్ అయినట్టు పేర్కొన్నారు. కాగా మయన్మార్‌లో 4,30,000 స్కూల్ టీచర్లు ఉన్నట్లు రెండు సంవత్సరాల కిందటి డేటాలో స్పష్టమైంది.

సైనిక తిరుగుబాటు, రాజ్యాంగబద్ధంగా అధ్యక్షురాలిగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ అరెస్టుతో మయన్మార్‌లో చోటుచేసుకున్న గందరగోళంతో పాఠశాలల్లో మొదలైన ఉద్యమం.. హెల్త్ సెక్టార్‌తో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బిజినెస్‌లపైనా ప్రభావం చూపుతోంది. ఈ మేరకు 19,500 మంది యూనివర్సిటీ సిబ్బందిని కూడా సస్పెండ్ చేసినట్టు టీచర్స్ గ్రూప్ తెలిపింది. జూన్‌లో స్కూళ్లు తెరుచుకోనుండగా.. వచ్చే వారం నుంచి రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. కానీ కొంతమంది పేరెంట్స్ కూడా తమ పిల్లలను బడికి పంపకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మిలిటరీ డిక్టేటర్‌షిప్‌లో చదువు చెప్పించడం ఇష్టం లేకపోవడంతో పాటు పిల్లల భద్రత విషయంలోనూ వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక రోజువారీ నిరసన కార్యక్రమాల్లో ముందున్న వందలమందిని భద్రతా బలగాలు కాల్చిచంపిన కారణంగా విద్యార్థులు కూడా తరగతులను బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడితేనే మళ్లీ స్కూల్‌కు వెళ్తామని పలువురు విద్యార్థులు చెబుతుండటం గమనార్హం.

ఇక మయన్మార్‌లో విద్యా వ్యవస్థ విషయానికొస్తే.. గతేడాది జరిపిన గ్లోబల్ సర్వేలో 93 దేశాలకు సంబంధించి 92వ ర్యాంక్‌తో అట్టడుగు స్థాయిలో ఉంది. సూకీ నాయకత్వంలోనూ ఈ పరిస్థితిలో మెరుగుదల కనిపించలేదు. తన హయాంలోనూ ఎడ్యకుషన్‌కు స్థూల దేశీయ ఉత్పత్తిలో 2 శాతం కన్నా తక్కువే కేటాయించారు. వరల్డ్ బ్యాంకు లెక్కల ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యల్పం.



Next Story

Most Viewed