ఇండియా వృద్ధి సున్నా.. మూడీస్ అంచనా!

by  |
ఇండియా వృద్ధి సున్నా.. మూడీస్ అంచనా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో విస్తృత ఆర్థిక లోటు, అధిక ప్రభుత్వ రుణం, బలహీనమైన మౌలిక సదుపాయాలతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదముందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ వృద్ధి ‘సున్నా’గా నమోదవుతుందని అంచనాలను వెల్లడించింది. గత కొన్నేళ్లలో ఇండియా ఆర్థిక వృద్ధిలో నాణ్యత తగ్గిందని, గ్రామీణ కుటుంబాల్లో ఆర్థిక ఒత్తిడి, ఉత్పాదకత క్షీణించడం, బలహీన పడిన ఉద్యోగ కల్పనలు వంటి అంశాలు దీనికి కారణమని ఏజెన్సీ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి ఫ్లాట్‌గా ఉంటుందని సంస్థ అంచనా వేసింది. అంతేకాకుండా, రానున్న ఆర్థిక సంవత్సరం 2021-22లో జీడీపీ వృద్ధి పుంజుకుని 6.6 శాతం ఉండొచ్చని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆందోళనలు పెరగడం, లాక్‌డౌన్ భయాలతో రిస్క్ పెరిగిందని ఏజెన్సీ వెల్లడించింది. ఏప్రిల్ చివర్లో మూడీస్ 2020 ఏడాది జీడీపీ వృద్ధిని 0.2 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. కరోనాను తగ్గించడానికి ఇటీవల కేంద్రం లాక్‌డౌన్ పొడిగించడంతో ఆర్థిక వ్యవస్థ ఇంకా ఒత్తిడికి గురయిందని మూడీస్ రేటింగ్స్ ఏజెన్సీ అభిప్రాయపడింది.

ఇదివరకే కేంద్రం రూ. 1.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించగా, మరో ప్యాకేజీ ప్రకటిస్తుందనే ఊహాగానాలపై మూడీస్ స్పందిస్తూ..కేంద్రం గనక ఈ చర్యలు తీసుకుంటే వృద్ధి మందగమనం తగ్గొచ్చు. కాకపోతే, గ్రామీణ కుటుంబాల్లో దీర్ఘకాలికంగా ఆర్థికపరమైన ఒత్తిడి, ఉద్యోగ కల్పనలో బలహీనత, బ్యాంకేతర ఆర్థిక సంస్థల్లో రుణాలు బలహీనపడటం వంటి పరిణామాలు ఉంటాయని బ్రోకరేజ్ సంస్థ చెప్పింది.

Tags: India Economic Growth, India Gdp Growth, GDP Growth, Job Creation, Rating Downgrade, Moody’s Rating



Next Story

Most Viewed