భారత ఆర్థిక వృద్ధి రేటును సవరించిన మూడీస్

by  |
భారత ఆర్థిక వృద్ధి రేటును సవరించిన మూడీస్
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటు 7 శాతానికి క్షీణిస్తుందని అభిప్రాయపడింది. ఇదివరకు భారత జీడీపీ 10.6 శాతం ప్రతికూలంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. అదేవిధంగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2021-22 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 10.08 శాతం నుంచి 13.7 శాతానికి సవరిస్తున్నట్టు వెల్లడించింది. భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచంలోనే ఎక్కువ రోజుల కఠినమైన లాక్‌డౌన్ నుంచి చాలా తొందరగా పుంజుకుంది. ఈ లాక్‌డౌన్ వల్ల గతేడాది రెండో త్రైమాసికంలో జీడీపీ బాగా పడిపోయిందని మూడీస్ అభిప్రాయపడింది.

‘దేశంలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాల్లో ఎక్కువ భాగం 2020 చివరి నాటికి మహమ్మారి పూర్వస్థాయికి కోలుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ వృద్ధి అంచనాలను సవరించినట్టు’ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అసోసియేట్ మేనేజింగ్ డైరెక్టర్ జీన్ ఫాంగ్ ఓ ప్రకటనలో చెప్పారు. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసే త్రైమాసిక జీడీపీ గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో మూడో త్రైమాసిక గణాంకాలు సానుకూల వృద్ధిని నమోదు చేస్తాయని పలు రేటింగ్ ఏజెన్సీలు ఆశిస్తున్నాయి.


Next Story