పెరిగిన ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే యాక్టివ్ యూజర్ల సంఖ్య.!

by  |
పెరిగిన ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే యాక్టివ్ యూజర్ల సంఖ్య.!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది కొవిడ్-19 ప్రభావం ఉన్నప్పటికీ ఈ-కామర్స్ విభాగానికి పెరిగిన డిమాండ్‌తో వ్యాపార వృద్ధి మెరుగైన స్థితిలో ఉందని ప్రముఖ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ (Walmart)వెల్లడించింది. భారత్‌లో అనుబంధ సంస్థలుగా ఉన్న ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart), ఆన్‌లైన్ చెల్లింపుల ఫోన్‌పే (Phone pe) యాప్‌లకు నెలవారీ క్రియాశీల వినియోగదారులు (Monthly Active user) భారీగా పెరిగారని వాల్‌మార్ట్ తెలిపింది. ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో తమ సంస్థ అమ్మకాలు సుమారు 29.6 బిలియన్ డాలర్లకు చేరుకుందని, ఇది గతేడాదితో పోలిస్తే 1.3 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది.

కరోనా వ్యాప్తి సంబంధిత సవాళ్లను అధిగమించడం, పండుగ సీజన్ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే వ్యాపారాల్లో పటిష్టమైన వృద్ధి కారణంగానే ఇది సాధ్యమైందని వాల్‌మార్ట్ వివరించింది. గత నెలలో బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లను ప్రకటించిన తర్వాత దేశీయంగా యాక్టివ్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, తద్వారా వ్యాపారవృద్ధి సాధించినట్టు కంపెనీ పేర్కొంది. ఇదివరకటి కంటే కరోనా వ్యాప్తి తర్వాత అమ్మకాలపై తీవ్రమైన ప్రభావం ఉన్నప్పటికీ.. సంస్థ ఆదాయం మెరుగ్గా ఉందని, గతేడాదితో పోలిస్తే 5.2 శాతం పెరిగిందని వాల్‌మార్ట్ తెలిపింది. కాగా, జులై నెలలో ఫ్లిప్‌కార్ట్ కంపెనీ వాటాదారుల నుంచి సుమారు రూ. 8,800 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ పెట్టుబడుల ద్వారా దేశీయంగా ఈ-కామర్స్ వ్యాపారాన్ని మరింత విస్తరణకు వినియోగించనున్నట్టు వాల్‌మార్ట్ వెల్లడించింది.

Next Story