ఆ పొలాల్లో భయపెడుతున్న రోబో నక్కలు..

by  |
ఆ పొలాల్లో భయపెడుతున్న రోబో నక్కలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : పంట పొలాలను రైతులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అయితే ఆరుగాలం శ్రమించి పండించిన పంట ప్రకృతి విపత్తుల కారణంగా నాశనమైతే రైతు చేసేదేం ఉండదు. కానీ ఆ పంటల్ని జంతువులు, పక్షులు పాడు చేయాలని చూస్తే మాత్రం రైతు వాటిని తరిమి తరిమి కొడతాడు. పక్షుల నుంచి పంటను కాపాడుకునే క్రమంలో చేనులో అక్కడక్కడా దిష్టిబొమ్మలు ఏర్పాటు చేసి, వాటికి చీరలు కడతారు. అడవి పందులు, కోతుల బెడద నుంచి రక్షించడానికి కూడా రకరకాల ఏర్పాట్లు చేస్తారు. కానీ జపాన్ రైతులకు ఎలుగుబంటి రూపంలో సమస్య ఎదురైంది. దాంతో అక్కడి రైతులు వినూత్నంగా ఆలోచించి, నక్కలను కాపలాగా పెట్టారు. కానీ అవి ప్రాణం లేని నక్కలు. పరుగులు పెట్టలేని మరబొమ్మలు.

జపాన్ అంటేనే టెక్నాలజీలో రారాజు. కాగా, ఇప్పుడు ఆ దేశ రైతులు కూడా టెక్నాలజీని ఉపయోగించి తమ పంటలను కాపాడుకుంటున్నారు. ఇటీవల కాలంలో జపాన్‌లోని వెస్టర్న్, నార్తర్న్ రూరల్ ఏరియాల్లో ఎలుగుబంట్ల బెడద ఎక్కువైంది. అందులోనూ హొక్కాయిడోలోని టాకికావ పట్టణంలో ఎలుగుబంట్లు పంటల్ని తీవ్రంగా నష్టపరచడంతో అక్కడి వాళ్లకో ఆలోచన వచ్చింది. సాధారణంగా ఎలుగుబంట్లు నక్కలను చూస్తే భయపడతాయి. అందుకే రోబో నక్కను పంటలకు కాపలాగా పెట్టాలని అక్కడి రైతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే టెక్ నిపుణులు ‘మాన్‌స్టర్ వోల్ఫ్’కు ప్రాణం పోశాయి.

ఆ మాన్‌స్టర్ వోల్ఫ్ చూసేందుకు చాలా భయంకరంగా ఉంటుంది. మోషన్స్ డిటెక్టర్‌ను కలిగి ఉండే ఆ రోబో నక్క.. తన హెడ్‌ను పక్కకు కూడా తిప్పగలుగుతుంది. అలా చేసినప్పుడు దాని కళ్లలో ఎర్రని లైట్లు వెలుగుతాయి. అంతేకాదు మొత్తంగా 60 రకాల భిన్నమైన శబ్దాలను చేయగలదు. ఈ రోబోలు సౌర విద్యుత్‌తో పనిచేస్తుండటంతో.. కరెంట్ బిల్లు సమస్య కూడా ఉండదు. కాగా ఈ భయంకరమైన నక్క బొమ్మలను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎలుగుబంట్లు ఆ పొలం దరిదాపుల్లో కూడా కనిపించడం లేదట. ‘ఓహ్తా సెకి’ అనే టెక్ సంస్థ ఈ రోబో నక్కలను తయారు చేస్తోంది. ఇప్పటివరకు సుమారు 70 రోబో నక్కలను రూపొందించి, రైతులకు అందజేసింది.



Next Story

Most Viewed