ఒక్క ఐడియా ఆ రైతు జీవితాన్నే మార్చేసింది.. పెద్దపులి బొమ్మతో..!

by  |
peddapuli
X

దిశ, పాలేరు : ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అందులో ఒకటి పక్షులు కాగా మరొకటి కోతులు. తోటలు, పంట పొలాల్లో వేసిన పంటను నాశనం చేయడం సర్వసాధారణమైంది. ఇక చాలా జిల్లాల్లో కోతుల బెడద రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పంట పొలాల నుండి కోతులను తరిమికొట్టేందుకు వారి చేయని ప్రయత్నాలు ఉండవు.

ఈ నేపథ్యంలోనే కోతులు, పక్షులు బెడద నుండి పంటలను రక్షించడం కోసం ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు సరికొత్త ఆలోచన చేశారు. అతని ఆలోచన సత్ఫలితాలను ఇచ్చింది. కూసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన మలిశెట్టి సత్యనారాయణ అనే రైతు తన మామిడి తోటలోకి కోతులు రాకుండా పులి బొమ్మను ఉపయోగిస్తున్నారు. అంతకుముందు పిల్లలు ఆడుకునే సమయంలో పులి బొమ్మను చూసిన కోతులు దూరంగా వెళ్లాడాన్ని గమనించాడు.

దీంతో రెండు వేల రూపాయలు పెట్టి పెద్ద పులి బొమ్మను కొని పొలంలో కాపలా పెట్టాడు. అచ్చం పెద్దపులి లానే ఉన్న బొమ్మను చూసి కోతులు భయంతో అటు వైపు రావడమే మానేశాయి. సత్యనారాయణ ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు. కోతులను వెళ్లగొట్టేందుకు తాము ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయామని తోటి రైతులు చెప్పుకొచ్చారు. సత్యనారాయణ ఫార్ములాను ప్రస్తుతం అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ సైతం ఫాలో అవుతున్నారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ ప్రస్తుతం పులి బొమ్మలు దర్శనమివ్వడం గమనార్హం.



Next Story

Most Viewed