బావ ఇంటికే కన్నం వేసిన బావమరిది..

by  |
బావ ఇంటికే కన్నం వేసిన బావమరిది..
X

దిశ, వేములవాడ: డబ్బులు అవసరం ఉండి వరుసకు బావమరిది వద్ద అప్పుగా రూ.5 లక్షలు తీసుకున్న బావ ఇంటికే బావమరిది కన్నమేయగా అరెస్ట్ చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహూల్ హెగ్డే తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. అంబికా‌నగర్‌లో నివాసం ఉంటున్న రాగుల రమేష్ తన స్వగ్రామమైన బస్వాపూర్ గ్రామంలో ఇంటి సమీపంలో గల పాత ఇల్లు అమ్మకానికి రావడంతో ఎలాగైనా ఆ ఇంటిని కొనుగోలు చేయాలని, వరసకి బావమరిదైన అదే గ్రామానికి చెందిన పొన్నం శేఖర్ వద్ద అప్పుగా రూ.5 లక్షలు తీసుకున్నాడు. అయితే శేఖర్ తన బావ రమేష్‌కు ఇచ్చిన డబ్బులు ఎలాగైనా కాజేయాలని పక్కా ప్రణాళికతో అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి దొంగతనానికి ప్లాను వేశాడు.

రమేష్‌కు గత నెల 25న రూ.5 లక్షలు శేఖర్ ఇవ్వడంతో అట్టి డబ్బులను రమేష్ నివాసం ఉంటున్న ఇంటి బీరువాలో పెట్టి పని మీద బస్వాపురం వెళ్లగా, ఇదే అదునుగా భావించిన ప్రశాంత్ అంబికానగర్‌లో ఉన్న రమేష్ ఇంటి వెనకాల నుంచి వెళ్లి, బీరువాలో దాచి పెట్టిన రూ. 5 లక్షల నగదును చోరీ చేశాడు. ఈ విషయం ప్రశాంత్, శేఖర్‌కు చెప్పడంతో ఇద్దరు డబ్బులు పంచుకున్నారు. అట్టి డబ్బుల‌తో సిరిసిల్లలో వ్యవసాయ మార్కెట్ వద్దకు రావడంతో పక్కా సమాచారం మేరకు వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వారి నుండి రూ.5 లక్షల నగదును రికవరీ చేశామన్నారు. దొంగతనం కేసును చేధించిన సీఐలు అనిల్ కుమార్, ఉపేందర్, ఎస్సైలు సుధాకర్, శరతులను అభినందించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Next Story

Most Viewed