కౌన్సిలర్ల వసూళ్ల దందా.. పార్టీలు వేరైనా మనీపైనే ఫోకస్

by  |
కౌన్సిలర్ల వసూళ్ల దందా.. పార్టీలు వేరైనా మనీపైనే ఫోకస్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : మహానగర విస్తరణలో శివారు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. లే అవుట్లు, బహుళ అంతస్తుల భవనాలు పుట్టుకొస్తున్నాయి. దీన్ని పలువురు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అవకాశంగా తీసుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ.. అందిన కాడికి దండుకుంటున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు తాగునీటి, డ్రైనేజీ పైపులైన్లు వేసినా డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రోడ్లు వేయాలన్న ముడుపుల కోసం వేధిస్తున్నారని సమాచారం.

దీపం ఉన్నప్పుడే..

కొందరు మున్సిపల్ చైర్మన్లు, చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఆఫీసులలోనే దర్జాగా వసూళ్ల పర్వం మొదలు పెట్టారనే ఆరోపణలున్నాయి. పార్టీలు వేరు అయినా పంపకాల్లో మాత్రం ఒక్కటవుతున్నారు. కొందరు చైర్మన్ల ఛాంబర్లు సెటిల్ మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క దిద్దుకోవాలి అనే నానుడిని నగర శివారులో మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, నిజాంపేట, దుండిగల్, కొంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలలో కొందరు ప్రజాప్రతినిధులు నిజం చేస్తున్నారు. అందినకాడికి దోసుకుంటున్నారు. మరికొందరైతే మున్సిపల్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చులన్నీ ఒక ఏడాదిలోనే రాబట్టుకోవాలని వసూళ్లు చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. పలువురు కమిషనర్లకు సైతం వాటాలు ఉండడంతో ఎలాంటి విభేదాలు లేకుండా వసూళ్ల దందా సాఫీగా సాగిపోతోందనే విమర్శలున్నాయి.

కౌన్సిలర్ పై ఫిర్యాదు..

పైపులైన్ వేయాలని కోరితే మేడ్చల్ నాల్గవ వార్డు కౌన్సిలర్ తుడుం గణేశ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ బాధితుడు గడ్డం బాబు ఈ నెల 20న జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. గోదాంలో వర్షపు నీరు నిలుస్తుండడంతో పైప్‌లైన్ ఏర్పాటు చేయడానికి గోదాం నిర్వాహకుల దగ్గర రూ. 8లక్షలు కౌన్సిలర్ డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మురుగు కాల్వలోకి నీరు వదిలేందుకు పనులు చేపట్టిన పనులను అడ్డుకొని డబ్బులిచ్చి పనులు చేపట్టాలని హుకుం జారీచేసినట్లు బాబు తెలిపారు. కౌన్సిలర్ పై తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. కౌన్సిలర్ కాల్ రికార్డును కూడా బాధితుడు బయట పెట్టడం హాట్ టాఫిక్‌గా మారింది. మేడ్చల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపికాతో కలిపి మొత్తం ఎనిమిది లక్షలు ఇవ్వాలని కాల్ రికార్డింగ్‌లో ఉంది. మొత్తం డబ్బులు చెలించాకే పనులు చేపట్టాలని తుడం గణేష్ గోదాం నిర్వాహకులను ఆదేశించారు.

కౌన్సిలర్ల రింగాట..

పార్టీలు వేరైనా కొందరు కౌన్సిలర్ల వసూళ్ల కోసం ఒక్కటవుతున్నారు. ఏ భవన నిర్మాణం వద్దకుకానీ, లే అవుట్ వద్దకు కానీ వెళ్లకుండానే ముడుపులు తమ దగ్గరకి వచ్చేలా వ్యవహారాన్ని చక్క బెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇందుకోసం ప్లానింగ్ విభాగంలో కొంత మంతి సిబ్బందిని నియమించుకుంటున్నారని సమాచారం. కొందరైతే అనుచరులు, ప్రైవేటు వ్యక్తులచే వసూళ్లకు దిగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహారిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. పాలకుల ఒత్తిడికి తలొగ్గి నామామాత్రపు చర్యలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed