సెలబ్రిటీ ఫార్మింగ్.. సాగుబాట పట్టిన మలయాళీ స్టార్స్

by  |
సెలబ్రిటీ ఫార్మింగ్.. సాగుబాట పట్టిన మలయాళీ స్టార్స్
X

దిశ, ఫీచర్స్: భారత్ వ్యవసాయ ఆధారిత దేశమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగ్రి‘కల్చర్’ మన కల్చర్ అన్నది ప్రపంచ దేశాలకూ విదితమే. అయితే కాలక్రమేణా అగ్రికల్చర్‌ను కెరీర్‌గా ఎంచుకునేవారు తగ్గిన మాట వాస్తవం. ప్రధానంగా చాలావరకు యవత నగరాలకు వలస వెళ్లి, అక్కడే ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతుండటంతో క్రమేణా సాగు కళ తప్పిపోయింది. ఈ నేపథ్యంలోనే ఉపద్రవంలా ముంచుకొచ్చిన కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా దాదాపు అన్ని రంగాల్లోనూ భారీ స్థాయిలో ఉద్యోగాలు ఊడిపోయాయి. దీంతో ప్రై‘వేటు’, ఇతర రంగాల్లో పనిచేస్తూ ‘వేటు’కు గురైన ఉద్యోగులు సొంతూళ్ల బాటపట్టి, ఉన్న భూమిలోనే పంటలు పండించడం షురూ చేశారు. ఈ క్రమంలో సామాన్యులతో పాటు మాలీవుడ్ (మలయాళం ఇండస్ట్రీ) సెలబ్రిటీలు సైతం సాగు బాట పట్టడం విశేషం. మోహన్ లాల్, మమ్ముట్టి, జయరాం.. తమ యాక్టింగ్ కెరీర్‌ కొనసాగిస్తూనే అగ్రిప్రెన్యూర్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఇంతకీ వారు ఏయే పంటలు పండిస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

మోహన్‌లాల్

మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్(లాలెటా).. కొవిడ్ వల్ల అందరిలాగే తను కూడా ఇంట్లోనే లాక్ అయ్యాడు. ఈ సమయంలో మిద్దెతోటల పెంపకాన్ని ప్రారంభించాడు. తన ఇంటి ప్రాంగణంలో ఓక్రా మొక్కలు నాటిన మెహన్‌లాల్.. సేంద్రియ పద్ధతిలో ఇంటికి సరిపడా కూరగాయలు పండించడం మొదలుపెట్టాడు. ఇక అప్పట్నుంచి సినిమాలు చేస్తూనే, సమయం దొరికినప్పుడల్లా స్వయంగా గార్డెనింగ్ పనులు చేస్తున్నాడు. వ్యవసాయం అనేది అన్ని కళల్లో కెల్లా గొప్పకళ అని, తను రైతునని చెప్పేందుకు గర్విస్తానని లాలెటా తెలిపారు.

మమ్ముట్టి

మాలీవుడ్ మరో మెగాస్టార్ మమ్ముట్టి.. తాను తీసుకునే ఆహారం పట్ల చాలా కేర్ తీసుకుంటారు. రసాయనాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల హెల్త్‌పై తీవ్ర ప్రభావముంటుందని గ్రహించిన ఈ స్టార్.. సహజ పద్ధతిలో పంటలు పండించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. కొవిడ్ కారణంగా తీరిక సమయం దొరకడంతో.. కూరగాయలు సాగు షురూ చేశాడు. రసాయన ఎరువులు వాడకుండా, సొంతంగా ఆయనే ట్రాక్టర్ నడుపుతూ తన పొలంలో నాటు వేయించాడు. తన ఇంటి గార్డెన్‌లో కూరగాయ మొక్కలు, పండ్ల విత్తనాలు నాటాడు. బిజీ టైమ్‌లో కూడా కొంత భాగం అగ్రికల్చర్‌కు కేటాయిస్తున్నాడు.

జయరాం

విలక్షణ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయరాం. కొవిడ్ కంటే ముందు నుంచే వ్యవసాయం చేస్తున్న జయరాం.. కేరళలోని మలయట్టూర్‌లో మిద్దెతోటల పెంపకం స్టార్ట్ చేశాడు. డెయిరీ నిర్వహిస్తూ చాలాసార్లు వార్తల్లో నిలిచాడు. నామమాత్రంగా కాకుండా రోజులో కొంత సమయాన్ని తప్పకుండా డెయిరీకి కేటాయిస్తున్నాడు జయరాం. ప్రతిరోజూ డెయిరీ వద్దకెళ్లి, ఆవులను చూసుకుంటూ వాటికి మేత అందించడంతో పాటు ఇంకా ఏం అవసరాలున్నాయో ఆరా తీస్తుంటారు.

జోజు జార్జ్

పాండమిక్ ప్రారంభం కావడంతో సస్టెయినెబుల్ లివింగ్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్న జోజు జార్జ్.. ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ కోసం సేంద్రియ పద్ధతిలో సేద్యం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన హోం టౌన్‌ గార్డెన్‌లో బెండకాయలు, టమాటా, బీరకాయ తదితర కూరగాయలు పండిస్తూ.. పశువుల పెంపకంపైనా దృష్టి సారించాడు. సహజ పద్ధతిలో సేద్యం చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందని జార్జ్ అభిప్రాయపడుతున్నాడు.

కృష్ణప్రసాద్

‘మూన్నంపక్కం’ చిత్రంతో మాలీవుడ్‌కు పరిచయమైన కృష్ణ ప్రసాద్.. ఇప్పటివరకు వందకు పైగా చిత్రాల్లో నటించారు. ఈయన కరోనా కంటే ముందే అనగా 2007లోనే వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. తనపొలంతో వరితో పాటు కూరగాయలు పండిస్తున్నారు. అగ్రికల్చర్‌లో తాను సాధించిన దిగుబడి, ఉత్తమ ఫలితాలకు గాను కృష్ణ ప్రసాద్‌కు కేరళ రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు కూడా వరించింది. కాగా తను ఎక్కువ సమయాన్ని వ్యవసాయానికి కేటాయించేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తానని కృష్ణప్రసాద్ చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed