పాతబస్తీలో ప్రశాంతంగా ముగిసిన మొహర్రం

by  |
పాతబస్తీలో ప్రశాంతంగా ముగిసిన మొహర్రం
X

దిశ, చార్మినార్: కర్బలా మైదానంలో ధర్మ పరిరక్షణ కోసం అసువులు భాసిన అమరులను స్మరిస్తూ షియా సోదరులు శుక్రవారం నిర్వహించిన మొహర్రం పదవ సంతాప దినం ఊరేగింపు ఆధ్యాత్మికను చాటింది. చారిత్రాత్మక బీబీకా ఆలంను ఏనుగుపై ప్రతిష్టించి దాని ముందు చిన్నపెద్ద తారతమ్యం లేకుండా షియాలు భక్తి గీతాలు ఆలపిస్తూ తమ రక్తాన్ని చిందిస్తూ తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

లక్షలాదిమంది షియా సోదరులు ఊరేగింపులో పాల్గొన్నారు. దీంతో పాతబస్తీ పురవీధులు ఆర్తనాథాలతో మారుమ్రోగాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు చారిత్రాత్మక బీబీకా ఆలంను వజ్ర వైడుర్యాలతో అలంకరించి ఏనుగు అంభారిపై ప్రతిష్టించారు. బీబీకా ఆలం నుంచి ఊరేగింపును ప్రారంభించారు. నల్లని వస్త్రాలు ధరించి షియాలు సంతాప గీతాలు ఆలపిస్తూ దారి పొడవునా యా హుస్సేని.. యా ఆలీ అంటూ చుర కత్తులు, బ్లేడులు, తల్వార్లతో తమ శరీరంపై బాదుకుంటూ రక్తాన్ని చిందించారు. దారి పొడవున భక్తులు బీబీకా ఆలంకు దట్టీలు సమర్పించారు.

బీబీకా ఆలం ఊరేగింపు మత పెద్దల ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఊరేగింపుగా ముందుకు సాగింది. బీబీకా ఆలం నుంచి షేక్​ ఫైసీ కమాన్, యాకుత్​పురా, మజీదే ఇత్తేబార్​ చౌక్, ఆలీజా కోట్ల, సర్దార్ మహల్​ మీదుగా చార్మినార్​కు చేరుకుంది. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నగర పోలీస్​ కమిషనర్ అంజనీకుమార్, అదనపు కమిషర్​ డీఎస్​ చౌహాన్, షికా గోయల్, దక్షిణమండలం డీసీపీ గజరావు భూపాల్‌లు పాల్గొని బీబీకా ఆలంకు దట్టీలు సమర్పించారు. చార్మినార్ నుంచి ఊరేగింపు గుల్జార్​ హౌజ్, పంజేషా, దారుల్​షిఫా మీదుగా చాదర్​ఘట్ వరకు సాగింది.

ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నగర పోలీస్​ కమిషనర్ ​అంజనీ కుమార్ ఆధ్వర్యంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్​ భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. మీరాలం మండి వద్ద బీబీకా ఆలం ఊరేగింపును మాజీ ఎంపీ అంజన్ ​కుమార్ ​యాదవ్,​ యువజన కాంగ్రెస్ ​మాజీ అధ్యక్షుడు అనిల్​కుమార్, గాజుల అంజయ్యలు బీబీకా ఆలంకు దట్టీలు సమర్పించారు. ఊ‌‌రేగింపులో పాల్గొన్న యువకుల దాహార్తిని తీర్చడానికి పలు స్వచ్ఛంద సంస్థలు శర్బత్‌తో పాటు మంచి నీటిని పంపిణీ చేశారు.



Next Story

Most Viewed