డంపింగ్ యార్డులో మోడల్ క్యాట్ వాక్.. ఎందుకో తెలుసా..?

by  |
డంపింగ్ యార్డులో మోడల్ క్యాట్ వాక్.. ఎందుకో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్ : రోడ్డు మీద చెత్త పడేసే పౌరులకు ప్రభుత్వాలు కొన్ని చోట్ల జరిమానా విధిస్తాయి. కానీ అదే మున్సిపల్ వాళ్లు కొండలా చెత్తను పేర్చి అలాగే వదిలేస్తుంటారు. అధికారులు కూడా ఆ గార్బేజ్ క్లీనింగ్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ సమస్య ప్రతీ గ్రామంలో, పట్టణంలో ఉండగా.. జార్ఖండ్‌ నగర శివార్లలోని జిరిలో పెద్ద డంప్‌‌యార్డ్ ఉంది. దాని వల్ల ప్రజానీకానికి కలిగే నష్టాన్ని గమనించిన ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ప్రాంజల్.. ఈ సమస్యను అందరి దృష్టికి తీసుకురావడానికి మోడల్‌తో ఆ గార్బేజ్‌పై వీడియోషూట్ నిర్వహించాడు.

మోడలింగ్‌ను హాబీగా చేసే 12వ తరగతి విద్యార్థి సురభి సింగ్‌ సాయంతో, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ప్రాంజల్.. రాంచీ శివార్లలోని డంపింగ్ యార్డ్‌లో వేలాది టన్నుల చెత్తపై ‘క్యాట్‌వాక్’ వీడియో షూట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా వాతావరణ మార్పుపై పనిచేస్తున్న పలువురు అంతర్జాతీయ ప్రముఖులు, కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది. కేవలం డంపింగ్ యార్డ్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం రాలేదు. దాంతో చెత్తకుప్పపై ఫ్యాషన్ షూట్ ఆలోచనతో ముందుకు వచ్చాడు. మున్సిపల్ అధికారులు సమయానికి స్పందించక ఆ చెత్తను అలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారి మానవ జీవితాలకు ముప్పు వాటిల్లుతుందని తెలియజేసేందుకు తన మోడల్‌కు ‘డేంజర్’ సూచించే ఎరుపు దుస్తులను ఎంచుకున్నాడు.

‘ప్రభుత్వానికి, రాంచి మున్సిపల్ అధికారులకు ఇదో వేకప్ కాల్. చనిపోయిన జంతువులు, అనేక టన్నుల వైద్య వ్యర్థాలు, ఇతర విషపూరిత పదార్థాలను కూడా అన్నింటితో కలిపి అక్కడే పడేస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమైన విషయమని, ఈ సమస్యను ప్రజలు, అధికారుల దృష్టికి తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణవేత్తలను కూడా కదిలించాలనే ఉద్దేశంతోనే చేశాను. దీనివల్ల ‘క్లైమేట్ చేంజ్’ విషయంపై కూడా చర్చించాలని భావించాను. ఇప్పటికే సామాజిక కార్యకర్తలు, వాతావరణ మార్పు సమస్యపై పనిచేసే వ్యక్తులు దీన్ని చూసి అభినందించారు. మేము మా బాధ్యతను నెరవేర్చాం. ఇక ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించాల్సి ఉంది’ – ప్రాంజల్

రాంచీ నలుమూలల నుంచి సేకరించిన లక్షల టన్నుల చెత్తను 10 ఏళ్లుగా జిరి చెత్త డంప్ యార్డులోనే పడేస్తున్నారు. ఇది ఈ ప్రాంతంలో నివసిస్తున్న 10వేల మంది ప్రజల జీవితాలను తప్పకుండా ప్రమాదంలోకి నెట్టేస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే చెత్త డంప్ వల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు.


Next Story

Most Viewed