యువత ఎదుగుదల కోసం మొబైల్ టిఫిన్ సెంటర్లు

by  |
యువత ఎదుగుదల కోసం మొబైల్ టిఫిన్ సెంటర్లు
X

దిశ, రంగారెడ్డి : ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని ఎస్సీ యువత ఆర్థికంగా ఎదగాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పైలెట్ ప్రాజెక్ట్ కింద రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల ఎస్సీ యువతకు మంజూరు చేసిన 101 మొబైల్ టిఫిన్ సెంటర్ యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. కష్టపడి జీవన స్థితిగతులు మార్చుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ యూనిట్లకు సంబంధించి 60 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చిందని మిగిలిన 40 శాతాన్ని బ్యాంకు రుణంగా మంజూరు చేయించినట్టు తెలిపారు.

భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో ఇటువంటి మొబైల్ టిఫిన్ సెంటర్‌లను ఎస్సీ యువతకు అందించనున్నట్టు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2020-21లో అమలు చేసేందుకు రూ.786 కోట్ల 23 లక్షలతో రూపొందించిన ఎస్సీ కార్యచరణ ప్రణాళికను మంత్రి విడుదల చేశారు. దీనిలో రూ.500 కోట్లను కార్పొరేషన్ సబ్సిడీగా భరిస్తుందన్నారు. ఈ ప్రణాళిక కింద 18,525 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. భూమి కొనుగోలు, అభివృద్ధి, సాగుయోగ్యం, నీటి వసతి కల్పనకు, విద్యుదీకరణకు 100 శాతం సబ్సిడీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేగింగ్ డైరెక్టర్ కరుణాకర్, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రిజ్వాన్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story