పెరిగిన మొబైల్ గేమింగ్.. కారణం ఇదే!

by  |
పెరిగిన మొబైల్ గేమింగ్.. కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు వారానికి ఏడెనిమిది గంటలు మొబైల్‌లో గేమ్స్ ఆడే భారతీయులు.. ఇప్పుడు పది నుంచి పన్నెండు గంటల పాటు ఆడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు మొబైల్ గేమ్స్ ఆడుతున్నారని సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇందుకు కారణంగా కరోనా లాక్‌డౌన్ అని ఆ సంస్థ తమ నివేదికలో పేర్కొంది. ఒకప్పుడు అకేషనల్ గేమర్‌లుగా ఉన్నవాళ్లు కూడా కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడు ఫుల్ టైమ్ గేమర్లుగా మారిపోయారని తెలిపింది. అంతేకాకుండా వీడియో గేమ్‌లకు సంబంధించిన టెక్నికల్ అంశాల్లో కూడా చాలా మందికి అవగాహన ఏర్పడిందని, ఆ అవగాహనతోనే ఆపిల్ ప్రాసెసర్ల కంటే, మీడియాటెక్ ప్రాసెసర్లు మేలైనవని ఎక్కువ మంది అభిప్రాయపడ్డట్లు చెప్పింది.

‘నెక్స్ట్ జెన్ ఇండియన్ మొబైల్ గేమర్ : ఎ కన్జ్యూమర్ సర్వే రిపోర్ట్’ పేరుతో న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. 16 నుంచి 35 ఏళ్ల వయసున్న దాదాపు 1200 మందిని సర్వే చేసి ఈ నివేదికను వెల్లడించింది. అంతేకాకుండా గేమర్లలో 15 శాతం మంది ఉచిత గేమ్స్ కాకుండా, ప్రీమియం గేమ్స్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తేలింది. కరోనా కారణంగా ఒంటరిగా ఉంటూ, సోషల్ ఐసోలేషన్ బారిన పడి మానసిక సమస్యలు రాకుండా ఉండటానికి తమకు గేమింగ్ చాలా బాగా ఉపయోగపడిందని ఎక్కువ మంది అంగీకరించారు. ఎక్కువ మంది భారతీయులు యాక్షన్, అడ్వెంచర్ గేమ్స్ ఆడటానికి ఆసక్తి చూపిస్తున్నారని, ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్‌లో కనీసం ఏడు గేమ్స్ ఉంటున్నాయని వాటిలో తప్పనిసరిగా నాలుగు గేమ్స్‌ను ప్రతిరోజు ఓపెన్ చేసి, ఆడుతున్నారని ఈ సర్వేలో తేలింది. కరోనా వల్ల గేమింగ్ ఇండస్ట్రీ లాభాల బాట పట్టిందని చెప్పడానికి ఈ సర్వేను నిదర్శనంగా తీసుకోవచ్చని సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థ హెడ్ ప్రభు రామ్ తెలిపారు.



Next Story