అత్యాశతో వక్రమార్గంలో ఈటల : ఎమ్మెల్సీ పల్లా

by  |
అత్యాశతో వక్రమార్గంలో ఈటల : ఎమ్మెల్సీ పల్లా
X

దిశ, హుజురాబాద్: ముఖ్యమంత్రి కావాలనే అత్యాశతో ఈటల రాజేందర్ వక్రమార్గంలో టీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేశారని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. సోమవారం హుజూరాబాద్ మండలంలోని సింగాపురం గ్రామంలో ఇల్లందకుంట మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యకర్తలు అందరి మనోభావాలు తెలుసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని కార్యకర్తల అనుమానాలను నివృత్తి చేసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంతకు ముందు ఈటల రాజేందర్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉండే, కానీ ఇకనుండి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో పాటు తనను కూడా ఎమ్మెల్యేగా భావించాలన్నారు. హుజరాబాద్ లో బలమైన నాయకులు ఉన్నప్పటికీ ఈటల రాజేందర్ కి పార్టీ టికెట్ ఇచ్చారన్నారు. ఆరు సార్లు గెలిచానని చెప్పుకుంటున్న ఈటల టీఆర్ఎస్ పై ప్రజలకు ఉన్న నమ్మకంతోనే ఈటల గెలుపొందారన్నారు.

పార్టీలో సీనియరైన హరీష్ రావును కాదని సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఈటల రాజేందర్ కు శాసనసభ ఫ్లోర్ లీడర్ గా బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఈటలకు రెండు రోజులు రిలాక్స్ గా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారన్నారు. కానీ నేను లేకుండా చూసి రివ్యూ పెట్టారని ఈటల సీఎం పెట్టిన రివ్యూ వక్రీకరించారన్నారు. ఈటల రాజేందర్ కు నియోజకవర్గంలో విలువ పెంచేందుకే రైతుబంధు పథకాన్ని హుజరాబాద్ నియోజకవర్గం నుండే సీఎం కేసీఆర్ ప్రారంభించారన్నారు. ఉన్న వాళ్లకు రైతుబంధు పథకం వద్దన్న ఈటల ప్రతి పంటకు రూ. 3 లక్షలు ఎలా తీసుకున్నాడని ప్రభుత్వానికి తిరిగి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించినప్పటికీ ఈటల రాజేందర్ కి మాత్రం నచ్చలేదన్నారు.

దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తున్న అన్నారు రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. గురుకులాల్లో, హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యం పెట్టాలని ఈటల రాజేందర్ అడిగితే ఆ గౌరవం ఈటలకే దక్కాలని అతనితోనే కేసీఆర్ ఆ పథకాన్ని ప్రవేశపెట్టించారని గుర్తు చేశారు. మంత్రిగా అసైన్డ్ భూములు కొనడం తప్పు కాదా అని ప్రశ్నించారు. ఈటల అక్రమ భూముల క్రమబద్దీకరణ కోసం రోశయ్య దగ్గరికి, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడని, రాష్ట్రం కోసం కాదన్నారు. ప్రభుత్వం చేసిన పనులు చెప్పి పార్టీ కోసం ఓట్లు అడుగుతామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు టీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story