దేవుళ్లతో పాలిటిక్స్.. మీది జై శ్రీరామ్ నినాదమైతే.. మాది జై హనుమాన్..?

by  |
దేవుళ్లతో పాలిటిక్స్.. మీది జై శ్రీరామ్ నినాదమైతే.. మాది జై హనుమాన్..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉద్యమ ప్రస్థానంలో తండ్రి చాటు తనయగా కాకుండా, మహిళా లోకాన్ని చైతన్యం చేసేందుకు బతుకమ్మ ప్రోగ్రాం చేపట్టి బ్రాండ్ అంబాసిడర్గా మారారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి సంస్థలో అన్ని రకాల విభాగాలను ఏర్పాటు చేసి తెలంగాణ వాదాన్ని బలోపేతం చేసేందుకు నడుం బిగించారు. కొంతకాలం స్తబ్దుగా ఉన్నా, ఇప్పుడు మళ్లీ కొత్త ఎత్తులతో ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసిన ఆమె అనూహ్యంగా జై హనుమాన్ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

హనుమాన్ చాలీసా నిత్యపారాయణం కార్యక్రమాన్ని చేపట్టనున్నామని ప్రకటించారు. బీజేపీ జై శ్రీరాం నినాదానికి చెక్ పెట్టేందుకే కవిత జై హనుమాన్ పల్లవి ఎత్తుకున్నారని భావించారంతా. అయినా అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి రామకోటి స్తూపానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శంకుస్థాపన కూడా చేసి మరో కొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతున్నారని స్పష్టమవుతోంది. కేవలం రామ భక్త హనుమాన్ జపమే కాదు, రామ కోటి స్తూపంతో భగవంతుడికి, భక్తుడికి అనుసంధానం చేసే ప్రయత్నంలో మునిగిపోయారు.

అపవాదును చెరిపేయడానికే..

రెండున్నర సంవత్సరాల కిందట కొండగట్టులో బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం జరిగినా సీఎం కేసీఆర్​ఈ ప్రమాదం గురించి పట్టించుకోలేదన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే కొండగట్టు అంజన్న సన్నిధిలో కవిత వివిధ కార్యక్రమాలకు అంకురార్పణ చేసి తండ్రిపై పడిన బ్యాడ్ ఇమేజ్‌ను రూపు మాపే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ మొదలైంది.

ఓ వైపు జై హనుమాన్ నినాదంతో చాలీసా పారాయణం, మరో వైపు రామకోటి స్తూప నిర్మాణం కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలతో తండ్రి పై పడిన అపవాదును తుడిచిపెట్టే ప్రయత్నంలో మునిగిపోయారని అంటున్నారు. మొత్తంగా కవిత వేస్తున్న కొత్త ఎత్తుగడతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెత గుర్తుకొస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



Next Story