అంబానీతో పోల్చితే నా సాయమే గొప్ప: ఎమ్మెల్సీ కడియం

by  |
అంబానీతో పోల్చితే నా సాయమే గొప్ప: ఎమ్మెల్సీ కడియం
X

దిశ, వరంగల్: కరోనా నివారణకు రూ. వేల కోట్లు ఉన్న అంబానీ చేసిన సాయం కంటే తాను చేసిన సాయమే గొప్పదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కడియం ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 1200 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశానని తెలిపారు. అంబానీ రూ. 1500 కోట్లు ఇవ్వడం గొప్ప కాదని, తాను రూ. 10 లక్షలు ఖర్చు పెట్టడం గొప్ప అని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్‌తో దేశ సామాజిక ఆర్థిక పరిస్థితుల డొల్లతనం ఆవిష్కృతమైందని విమర్శించారు. హన్మకొండలో పద్మశాలి జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పరపతి సంఘం సభ్యులకు మంగళవారం కరోనా కరువు భత్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సంక్షోభం కారణంగా వలస కూలీలు పడుతున్న ఇక్కట్లను చూస్తే గుండె తరుక్కుపోతుందన్నారు. దేశ పాలకులు లాక్‌డౌన్ ప్రకటించే ముందే వలస కార్మికులను స్వస్థలాలకు పంపించి ఉంటే ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి తెలెత్తేది కాదన్నారు. కరోనా వ్యాప్తిలో ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో చాలా తక్కువ ఉందని ఇది లాక్ డౌన్ వల్లనే సాధ్యమైందని చెప్పారు. వలస కూలీలను స్వగ్రామాలకు తరలించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోవడం విచారకరమని తెలిపారు.

Tags: Warangal, Mlc Kadiyam srihari,Corona drought allowance, Journalist



Next Story