టీఆర్ఎస్‌కు షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా

by  |
Legislative Council
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆరు ఎమ్మెల్యే కోటా నిర్వహించాల్సిన ఎన్నికలను కరోనా దృష్ట్యా వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. వచ్చేనెల 3న మన రాష్ట్రంలోని ఆరు స్థానాలు ఖాళీ కానున్నాయి.

శాసనమండలిలో టీఆర్ఎస్​తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైఎస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, సభ్యులు కడియం శ్రీహరి, ఫరీరుద్దీన్‌, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు పదవీ కాలం పూర్తి అవుతుంది. గవర్నర్‌ కోటాలో భర్తీ అయిన ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డి స్థానం సైతం జూన్ 16న ఖాళీ కానున్నది. గవర్నర్‌ కోటా కింద భర్తీ చేసే స్థానానికి రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిన వ్యక్తి ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్యే కోటా స్థానాలకు శాసనసభ్యుల ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు.అయితే కరోనా నేపథ్యంలో ఇటీవల ఏడాదిపాటు ఎన్నికలు నిర్వహించలేమంటూ ఈసీ ఇటీవలే ప్రకటించింది. కానీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాళీల విషయంపై ఇటీవల ఈసీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ లేఖపై చర్చించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

వాస్తవంగా ప్రభుత్వ నిర్ణయంతో ఇవ్వాళో, రేపో నోటిఫికేషన్​ జారీ అవుతుందని భావించారు. ఆశావాహులు కూడా అధినేత దగ్గర దరఖాస్తులు పెట్టుకున్నారు. నోటిఫికేషన్​ తర్వాత 3 వారాల పరిధిలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. దీర్ఘకాలం తర్వాత ఒకేసారి ఏడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అవుతుండగా… వీటికి పెద్దఎత్తున పోటీ ఏర్పడింది. ప్రస్తుత సభ్యులకు తోడు కొత్తగా ఆశావహులు భారీ సంఖ్యలో ఉన్నారు. టీఆర్ఎస్​ బలం దృష్ట్యా ఆరు స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఈ ఆరు స్థానాలతో పాటుగా గవర్నర్‌ కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీ, టీఆర్ఎస్​ కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం జూన్‌ 16 వరకు ఉంది. వీటన్నింటికీ ఎంపిక ఉంటుందని ఆశించినా… కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా బ్రేక్​ వేసింది.


Next Story

Most Viewed