ప్రతిష్టాత్మకంగా ఆ ఎమ్మెల్సీ స్థానం.. వ్యూహాత్మకంగా పార్టీలు ముందుకు

by  |
ప్రతిష్టాత్మకంగా ఆ ఎమ్మెల్సీ స్థానం.. వ్యూహాత్మకంగా పార్టీలు ముందుకు
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: ఇటీవ‌ల వ‌ర‌కు మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌లు, మేయ‌ర్, ఉప‌మేయ‌ర్‌ల ఎన్నిక‌లు ముగియ‌డంతో కొంత చ‌ల్లబ‌డిన రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. తిరిగి ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లతో గ‌రం గ‌రంగా మారింది. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌లో అనూహ్య ప్రభావం చూపిన బీజేపీ పార్టీ మ‌హబూబ్ న‌గ‌ర్ – రంగారెడ్డి – హైద‌రాబాద్ స్థానాన్ని తిరిగి నిలుపుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇక్కడి నుండి గత ఆరేళ్ళుగా ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నేత ఎన్. రామచంద్రరావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ న‌ర‌సింహారావు కూతురు సుర‌భి వాణిదేవీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి , టీడీపీ ఎల్ ర‌మ‌ణ, గతంలో ఓసారి ఎమ్మెల్సీగా వ్యవహరించిన ప్రొ. నాగేశ్వర్ మరోసారి వామపక్షాల మద్దతుతో రంగంలోకి దిగారు. వీరే కాకుండా టీఆర్ఎల్డీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ పోటీ చేస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్….

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో విజ‌యం సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఆరేళ్ల క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ అభ్యర్థిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన ఉద్యోగ సంఘ నేత జీ దేవీప్రసాద‌రావు బీజేపీ అభ్యర్థి, న్యాయ‌వాది రామ‌చంద్ర రావు చేతిలో ఓట‌మి చ‌విచూశారు. దీంతో ఈ ప‌ర్యాయం టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీజేపీకి మ‌రోమారు అవ‌కాశం ఇవ్వరాద‌నే ఉద్ధేశ్యంతో వ్యూహాత్మకంగా మాజీ ప్రధాని పీవీ కుమార్తె సుర‌భి వాణిదేవీని బ‌రిలోకి దించింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడంతోపాటు పీవీ అభిమానుల ఓట్లు కూడా రాలుస్తుంద‌ని పార్టీ అంచ‌నా వేసిన‌ట్లుగా క‌న‌బ‌డుతోంది.

స‌వాలుగా తీసుకుంటున్న మంత్రి కేటీఆర్…

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల బాధ్యత మీద వేసుకున్న మంత్రి కేటీఆర్ ఊహించిన విజ‌యానికి అడుగు దూరంలో నిలిచిపోయారు. దీంతో మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక చివ‌రి వ‌ర‌కు సంక్లిష్టంగా మారింది. అయితే ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మాత్రం చిన్న పామునైనా పెద్ద క‌ర్రతో కొట్టాల‌నే విధంగా మంత్రి కేటీఆర్ పావులు క‌దుపుతున్నారు . ఇందులో భాగంగానే ఆయ‌న గ‌త బుధవారం తెలంగాణభవన్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా నేతలతో, ప్రగతిభవన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నేతలతో ఆయన విడివిడిగా సమావేశ‌మై.. వారికి దిశా నిర్ధేశం చేశారు. పార్టీ, ప్రభుత్వంపై కుట్రపూరితంగా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ బలంగా, ఆత్మవిశ్వాసంతో తిప్పికొట్టాలని ఆయ‌న ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో ఆత్మన్యూనతాభావంతో ఉండకూడదని, హోం వర్క్‌బాగా చేసి టీవీ చర్చల్లో పాల్గొనాలని సోషల్‌ మీడియాలో పార్టీ వాణిని బలంగా వినిపించాలని సూచించారు.

కీల‌కంగా మారనున్న ఉద్యోగుల ఓట్లు….

ఉద్యోగుల‌తో స్నేహ పూర్వక ప్రభుత్వమంటూ సీఎం కేసీఆర్ పాల‌న సాగిస్తున్నారు. అయితే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వారి స‌మ‌స్యలు దాట వేస్తూ వ‌స్తున్నారు. ముఖ్యంగా పీఆర్సీ , ఏపీకి కేటాయించిన ఉద్యోగులంద‌రినీ సొంత రాష్ట్రానికి తీసుకురావ‌డం ,ఉద్యోగుల వ‌యో ప‌రిమితి పెంపు , పాత పెన్షన్ విధానాన్ని అమ‌లులోకి తేవాల‌నేవి డిమాండ్ చేస్తున్నారు. ఇవి చాలా కాలంగా పెండింగ్ లో ఉండ‌డం, ఉపాధ్యాయుల ప‌ట్ల ప్రభుత్వం వ్యవ‌హ‌రిస్తున్న తీరుతో వారు గుర్రుగా ఉన్నారు. ఇవే కాకుండా నిరుద్యోగ యువ‌త కూడా ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంచ‌రాద‌ని డిమాండ్ చేస్తుండ‌గా పెంచాల‌ని ఉద్యోగులు కోరుతున్నారు. వ‌యో ప‌రిమితి పెంచితే పార్టీ ప‌రిస్థితి విడ‌వ‌మంటే పాముకు కోపం – క‌ర‌వ‌మంటే క‌ప్పకు కోపం అనేలా టీఆర్ఎస్ పార్టీ ప‌రిస్థితి త‌యారైంద‌ని టీఆర్ఎస్ లీడర్లలోనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఉద్యమ టైమ్ లో ఉన్న పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ ఆ వెంటనే జరిగిన కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. 2015 లోనూ జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి అతి కష్టం మీద బయటపడ్డారు. హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి పోటీచేసిన దేవిప్రసాద్ ఓడిపోయారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ టీఆర్ఎస్ లీడర్లే చెబుతున్నారు. ఆ వ్యతిరేకతను తట్టుకొని గెలవటం సాధ్యం కాదని ఓపెన్ గానే మాట్లాడుకోవ‌డం గ‌మ‌నార్హం.


Next Story

Most Viewed