మంత్రి గంగుల, మేయర్ సునీల్ రావులకు ‘సర్దార్జీ’ హెచ్చరిక.. మీ అవినీతి చిట్టా విప్పుతా..!

by  |
మంత్రి గంగుల, మేయర్ సునీల్ రావులకు ‘సర్దార్జీ’ హెచ్చరిక.. మీ అవినీతి చిట్టా విప్పుతా..!
X

దిశ, కరీంనగర్ సిటీ : కారు గుర్తుపై గెలిచిన నేను రాజీనామా చేయలేదు సరే… మరి నీవు కాంగ్రెస్‌లో గెలిచి, ఎలా వచ్చావ్ అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ మేయర్ సునీల్ రావును ప్రశ్నించారు. మధ్యాహ్నం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేయర్ పై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. టీఆర్ఎస్ పార్టీని విమర్శించే హక్కు నాకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఉద్యమం టైంలో నగరంలో ఏ ఒక్కరూ కూడా టీఆర్ఎస్‌లో చేరేందుకు సాహసించని రోజుల్లో తాను మాత్రమే ముందుకు వచ్చి అన్నీ తానై, అన్ని వర్గాల్లోకి విస్తరించానని గుర్తు చేశారు. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎదుర్కొని ఎంతో మంది యువతను పార్టీలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

నిన్న గాక మొన్న పార్టీలో చేరి లాబీయింగ్‌తో పదవి పొందలేదన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు బయట పెట్టేందుకే, నగర ప్రజలు నన్ను రాజీనామా చేయనివ్వటం లేదని తేల్చి చెప్పారు. అహంకార పూరిత వ్యాఖ్యలు మీ అవివేకానికి నిదర్శనమని, అధికారం అండతో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో అటు మంత్రి ఇటు మేయర్ యథేచ్చగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రానికి తరలించటం నేరం అయినా, ఎన్నికల అధికారుల ఎదుటే మంత్రి కొవిడ్ నిబంధనలు విస్మరించి, కండువాలు ధరించి గుంపులుగుంపులుగా నినాదాలు చేస్తూ పోలింగ్ బూతులోకి తీసుకెళ్లాడని విమర్శించాడు.

అక్కడే ఉన్న అధికారులకు ఫిర్యాదు చేసినా చోద్యం చూస్తూ ఉన్నాడే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా వారినే సమర్ధించాడంటూ మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని జగిత్యాల ఎస్పీ కండువా తీసి పోలింగ్ బూత్‌లోకి రావాలని సూచించగా, ఇక్కడ మాత్రం కండువా తోనే లోనికి అనుమతించటం పోలీసు అధికారులు ఏమేరకు విధులు నిర్వహించారో తేటతెల్లమవుతుందన్నారు. మంత్రి, మేయర్‌ల అవినీతి బండారం సమయానుకూలంగా బట్టబయలు చేస్తానన్నారు. ఈ సమావేశంలో గుంజపడుగు హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Next Story