గులాబీ గూటిలో టెన్షన్.. క్యాంప్ పాలిటిక్స్‌లో బిజీగా ఎమ్మెల్యేలు (వీడియో)

by  |
TRS vijaya garjana sabha
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా సొంత కేడర్‌ను కాపాడుకునే పనిలో టీఆర్ఎస్ పార్టీ పనులు మొదలుపెట్టింది. తెలంగాణలోని ఉమ్మడి తొమ్మది జిల్లాల పరిధిలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా మంగళవారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను బరిలో ఉంచుతున్నట్టు ఎక్కడా ప్రకటించకపోయినప్పటికీ.. చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ర్టంలో 2019లో జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్​ ఎన్నికలతో పాటు 2020లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో భారీగా జిల్లా పరిషత్, మండల పరిషత్‌లతో పాటు మోజార్టీ మున్సిపాలిటీలను అధికార పార్టీ దక్కించుకుంది.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను గెలవడం పెద్ద కష్టమేమికానప్పటికీ, గత కొన్ని నెలలుగా సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు.. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంలో అధికార పార్టీ ఉంది. దీంతో ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఓట్లు కాపాడుకోవడానికి అధికార పార్టీ ఎన్నికల షెడ్యూల్​విడుదలైన రోజు నుంచి తీవ్ర ప్రయత్నం చేస్తోంది. కేడర్ చేయి జారిపోకుండా ఉండేలా చూసుకోవాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యేలకు హైకమాండ్ బాధ్యతలను అప్పగించింది.

ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థుల వైపు ఫిరాయించకుండా జాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు అయిన ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను క్యాంపునకు తీసుకెళ్లడం మంచిదని భావించి వారిని ఏసీ బస్సుల్లో రీసార్ట్‌లకు తరలిస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉంటున్న 12 అభ్యర్థుల పేర్లు సోమవారం ఫైనల్ కావడంతో మంగళవారం టీఆర్ఎస్​ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఓటర్లను నామినేషన్ కార్యక్రమానికి తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్, బెంగుళూర్ నగరాలల్లోని రిసార్టులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇందు కోసం ఆర్టీసీ ఏసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు కొందరు సొంత వాహనాల్లో క్యాంపునకు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉన్న నేపథ్యం అనుకున్న స్థాయిలో ఎంపీటీసీలు క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.



Next Story

Most Viewed