రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది రెండో స్థానం.. సీతక్క సీరియస్

by  |
MLA Seethakka
X

దిశ, ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం శివపురం గ్రామానికి చెందిన బేతేల్లి కుమార్ అప్పుల బాధ భరించలేక ఇటీవల పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క కార్యకర్తలు, నాయకులతో కలిసి మృతుడి కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతు కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో కొనసాగుతోందని ఆరోపించారు.

రైతును రాజు చేయాలన్న నినాదంతో గెలుపొందిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై రైతుల పాలిట శాపంగా మారాయని ధ్వజమెత్తారు. రైతులకు లేనిపోని మాయమాటలు చెప్పి ఆత్మహత్యలకు కారకులు అవుతున్నారని ఆరోపించారు. రైతు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థికసాయం అందించారు. ఆమె వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అయ్యుబ్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు, మండల యూత్ అధ్యక్షుడు వసంతాశ్రీనివాస్, జిల్లా నాయకులు ఎండీ ఖలీల్ ఖాన్, ఎండీ గౌస్, చెల వినయ్, పీఏసీఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి, నాయకులు లాల్, మహమ్మద్, శ్రీధర్, శ్రీనివాస్, గద్ద రాజు, ఎండీ సర్దార్ పాష తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed