కేసీఆర్ ఇకనైనా నీ వైఖరి మార్చుకో : ఎమ్మెల్యే సీతక్క

by  |
కేసీఆర్ ఇకనైనా నీ వైఖరి మార్చుకో : ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, ములుగు : దళిత బంధును అన్ని వర్గాల వారికి రాష్ట్రమంతటా అమలు చేసి లబ్ధి చేకూర్చాలని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నాల్లేల కుమారస్వామి ఆధ్వర్యంలో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలన్నింటికి తెలంగాణ రాష్ట్రం మొత్తం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రమంతటా బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓట్ల కోసం జిమ్మిక్కులు చేసే కేసీఆర్ దళిత బంధు పథకం పేరిట కొత్త మోసానికి తెర లేపారు అని, ఉప ఎన్నికలు గెలవడం కోసమే దళితులకు దళిత బంధు ఇస్తానని మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నాడని అన్నారు.

దళితుల మీద నిజంగా కేసీఆర్ కు ప్రేమ ఉంటే, దళితుల అభివృద్దే కోరుకుంటే రాష్ట్రం మొత్తం దళిత బంధు అమలు చేసి 17 లక్షల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇవ్వాలి కానీ, ఒక్క హుజురాబాద్ నియోజకవర్గానికి మాత్రం ఇస్తా అనడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క ఎస్సీ కులానికి కాకుండా రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలన్నింటికి బంధు ప్రకటించాలన్నారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ తరుపున ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తన బుద్ది మార్చుకుని మోసపూరిత వాగ్దానాలు చేయకుండా ఇదివరకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ముఖ్యంగా దళితులకు మూడు ఎకరాల భూమి, అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, పంట రుణమాఫీ చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రజల తరుపున కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కూచన రవళి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవిచందర్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దాసరి సుధాకర్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి.ఆయుబ్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ ములుగు మండల అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న, ములుగు మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, మహిళా నాయకురాలు నాయకులు పాల్గొన్నారు.


Next Story