ఎన్నికలు ఎప్పుడు జరిగినా వార్ వన్ సైడ్.. ఫైర్ బ్రాండ్ రోజా కామెంట్స్

by  |
YCP MLA RK Roja
X

దిశ, ఏపీ బ్యూరో : దేశచరిత్రలో ఎంతో మంది సీఎంలు అయ్యారని కానీ, మేనిఫెస్టోను వంద శాతం పూర్తి చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని ఎమ్మెల్యే రోజా అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా గోపవరం మండలంలో ఎన్నికల ప్రచారంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపు కోసమే ప్రచారం చేస్తాం. కానీ ఇక్కడ వైసీపీ మెజారిటీ కోసమే ప్రచారం చేస్తోందని అన్నారు.

2019లో జగనన్న మీద అభిమానంతోనే స్వర్గీయ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యను 45 వేల మెజార్టీతో గెలిపించారు. ఈసారి భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘గత ప్రభుత్వంలో చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి పోయాడు. ఎంత అప్పు ఉన్నా రాష్ట్ర ప్రజల కోసం, సంక్షేమం కోసం మాటమీద నిలబడే కుటుంబం వైఎస్ కుటుంబం. కులం చూడం. మతం చూడం. పార్టీలు చూడం అని వాగ్దానం చేసి మేనిఫెస్టోను అమలు చేస్తున్న ఏకైక నేత సీఎం వైఎస్ జగన్’ అని రోజా కొనియాడారు.

వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్లే ఉందన్నారు. బద్వేల్ ఉప ఎన్నికలలో కూడా గత మెజార్టీ కంటే డబుల్‌గా మెజారిటీ ఇచ్చి జగనన్నకు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని పార్టీలు గుంపులు గుంపులుగా వచ్చినా వైసీపీ మాత్రం సింగిల్‌గా పోటీ చేస్తుంది. ఈ ఎన్నికలలో రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్.. రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీలకు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే రోజా ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story