TDP vs YSRCP: బోసిడికే అని లోకేశ్‌ను అంటే భువనేశ్వరి ఊరుకుంటారా?.. ఎమ్మెల్యే రోజా

by  |
Roja-11
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభి తిట్టిన బూతులు నారా లోకేశ్‌ను తిడితే నారా భువనేశ్వరి ఊరుకుంటారా అని ఆమె ప్రశ్నించారు. సీఎం జగన్‌పై బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో వైసీపీ రెండురోజులపాటు జనాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా పుత్తూరులో రోజా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చౌరస్తాలో ఉన్న వైయస్సార్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం రోజా నగరంలో నిరసన ర్యాలీ తీశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత పట్టాభిపై విరుచుకుపడ్డారు. ఆయనొక పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దేవాలయం లాంటిదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారని అది దేవాలయం కాదని రాక్షస క్రీడలకు నిలయమని విమర్శించారు. ఎన్టీఆర్‌కు ఎప్పుడైతే వెన్నుపోటు పొడిచి పార్టీని స్వాధీనం చేసుకున్నారో ఆనాడే అది క్షుద్రశక్తులకు నిలయంగా మారిందన్నారు. మరోవైపు చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రిని ఏ ముఖంపెట్టుకుని కలుస్తారంటూ ప్రశ్నించారు. అమిత్‌ వాహనంపై రాళ్లదాడి చేసిన ఘటన మరచిపోయారా అంటూ ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో కేంద్ర బలగాలు ఎంటర్ అవ్వకుండా జీవో తెచ్చిన చంద్రబాబు నేడు కేంద్ర బలగాలు కావాలంటూ ఎలా డిమాండ్ చేస్తారని రోజా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని ఇకనైనా టీడీపీ నేతలు మారాలని రోజా హితవు పలికారు.

Next Story

Most Viewed