TRS ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. కార్యకర్తలు తాలిబన్లలా రోడ్డుపైకి రావాలి..

by  |
trs 1
X

దిశ ప్రతినిధి, ఖమ్మం : వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మళ్లీ నోరు జారారు. ఈసారి ఏకంగా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపైనే అత్యంత తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. టీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం కొణిజర్ల మండలం అమ్మపాలెంలో జరిగింది. ఈ సందర్భంగా రాములు నాయక్ టీఆర్ఎస్ కార్యకర్తలు తాలిబన్లలా పార్టీ జెండా పట్టుకుని రోడ్లమీదకు రావాలని పిలుపునిచ్చారు.

అంతేకాదు.. టీఆర్ఎస్‌లో అందరూ ట్రైన్డ్ సోల్జర్లేనని అందుకే నక్సలైట్లలా ముందుకు సాగాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఓ బ్రాండ్ అని.. అందులో ఉండటమే ఎక్కువ కాబట్టి.. కార్యకర్తలు ఈల వేస్తే కర్రలు పట్టుకుని ఉరికిరావాలంటూ వ్యాఖ్యానించారు. కార్యకర్తలందరి చేతుల్లో ఆయుధాలు ఉంచుకొని.. ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రాములు పార్టీ పెద్దల మెప్పు పొందాలనుకున్నారో ఏమోగానీ పనిలో పనిగా ఇంకో మాటనూ విసిరారు. ఏంటనుకుంటున్నారా..? కార్యకర్తలందరూ చేతిలో ఆయుధాలున్నట్లుగానే భావించాలని.. అలాంటి వెపన్ ఉన్న వ్యక్తులు మంత్రులు అజయ్, కేటీఆర్.. సీఎం కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు.

రాములు నాయక్ మాటలు వింటున్న నేతలు, కార్యకర్తలు అందరూ అవాక్కయ్యారు. అయితే ఈ మాటలన్నీ ఎమ్మెల్యే స్వయంగా మంత్రి అజయ్ ఎదుటే మాట్లాడటం విశేషం. ఎప్పటిలాగే మళ్లీ ఎమ్మెల్యే ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారని ఆయన అనుచరులు భావించినట్లుగానే ఈసారి కూడా రాములు నాయక్ సొంత పార్టీ కార్యకర్తలపై తీవ్రపదజాలాన్ని ఉపయోగించారు.



Next Story

Most Viewed