భూపాల పల్లి టీఆర్ఎస్ లో నూతనోత్సాహం.. ఏకతాటి పైకి గండ్ర, సిరికొండ..

by  |
భూపాల పల్లి టీఆర్ఎస్ లో నూతనోత్సాహం.. ఏకతాటి పైకి గండ్ర, సిరికొండ..
X

దిశ, భూపాలపల్లి: సిరికొండ మధుసూదనాచారి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కలయికతో భూపాలపల్లి నియోజకవర్గం లోని టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. సిరికొండకి ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో ఆయన అనుచరులు సంబరాలు జరుపుకున్నారు. దీంతో భూపాల పల్లి లో టీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా ఏర్పడిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నెల రోజుల పాటు నియోజకవర్గం లోని టీఆర్ఎస్ నేతలు ఎవరి వైపు వెళ్లాలని సందిగ్ధంలో ఉన్నారు. అయితే అందరి అనుమానాలను తలకిందులు చేస్తూ.. సిరికొండ మధుసూదనాచారి ప్రమాణస్వీకారం సందర్భంగా గండ్ర వెంకటరమణా రెడ్డి దంపతులు ఆయనకు అభినందనలు చెప్పడంతో ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నట్టు తెలుస్తోంది.

ఇరువురు నాయకులు ఏకం కావడంతో నియోజకవర్గం లోని టీఆర్ఎస్ సైతం ఐక్యంగా కలిసి పనిచేసే అవకాశాలు ఏర్పడ్డాయి. ఎవరు ఎటు వెళ్ళినా ఏ నాయకులు వద్దకు వెళ్లిన చివరగా భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణా రెడ్డి మాటే శిరోధార్యమని పార్టీ వర్గాలు తేల్చి చెప్పాయి. గండ్ర, మధుసూధనాచారి వర్గాలు అంటూ ఏమీ ఉండవని అందరూ పార్టీ కోసమే పని చేయాల్సిందిగా అధిష్టానం నుండి సంకేతాలు వచ్చాయి. ఎమ్మెల్యే గండ్ర తనదైన శైలిలో తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

భూపాల పల్లి లో గండ్ర మాటే చెల్లుబాటు..

భూపాల పల్లి నియోజకవర్గంలో గండ్ర మాటే చెల్లుబాటు అయ్యే విధంగా అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఇరువురు నాయకులు ఎవరికివారే అన్నట్టు వ్యవహరించారు. ఇది ముందు ముందు పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని గ్రహించిన పార్టీ ఇరువురు నాయకులను కూర్చోబెట్టి మాట్లాడినట్టు సమాచారం. నియోజక వర్గంలో పార్టీకి సంబంధించిన విషయాలు గాని, ప్రభుత్వ పరమైన విషయాలు గానీ, శాసనసభ్యులు చివరిగా నిర్ణయము తీసుకుంటారని సమాచారం.

నియోజకవర్గంలో, ఎమ్మెల్సీ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా గండ్ర వెంకటరమణా రెడ్డి నడుచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇరువురు నాయకులు ఏకమైతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం అని నాయకులు అనుకుంటున్నారు.


Next Story