ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే

by  |
ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అధికారం చేతిలో ఉందని అలా ప్రవర్తిస్తున్నారా.. లేదా పార్టీలో అసంతృప్తిని ఇలా వెళ్లగక్కుతున్నారా.. అనేది అంతుబట్టని విషయం. పార్టీలో ఎవరి సంగతి ఏలా ఉన్నా.. వీలు చిక్కినప్పుడల్లా మంత్రి ఈటల రాజేందర్ తన అంసతృప్తిని వెళ్లగక్కుతుండగా, మరికొంతమంది అప్పుడప్పుడూ పార్టీని ఇరుకున పెట్టే.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే తరహా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయగా, తాజాగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత సైతం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రవర్తించారు. సంక్షేమ పథకాలు అమలు కావట్లేదని అడిగినందుకు ఓ గొల్లకురుమపై బెదిరింపులకు దిగారు. భవిష్యత్తులోనూ గొర్రెల పథకం సదరు వ్యక్తికి అందకుండా చేస్తామంటూ హెచ్చరించడం గమనార్హం.

అసలేం జరిగిందంటే..

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత రైతు వేదికను ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే సునీత మాట్లాడుతుండగా.. గొర్రెల పంపిణీ గురించి అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ప్రశ్నించారు. రెండో విడత గొర్రెల పంపిణీని ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదని ఆ సమావేశంలోనే అడిగాడు. దీంతో ఆగ్రహించిన ఆమె ప్రశ్నించిన వ్యక్తికి రెండో విడతలో గొర్రెలు ఇవ్వొద్దంటూ వేదికపై ఉన్న అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే సునీతను ప్రశ్నించిన వ్యక్తిని పోలీసులు రైతు వేదిక నుంచి బయటకు పంపేశారు. సీఎం కేసీఆర్ మరో నెలలో గొర్రెలు ఇస్తానంటున్నారు.. నీవు ఏలా తీసుకుంటావో చూస్తా.. ఆయనది ఏ ఊరు అంటూ అక్కడి అధికారులను ప్రశ్నించారు. అతడికి గొర్రెలను ఇవ్వొద్దంటూ సాక్షాత్తు ఎమ్మెల్యే సునీత రైతు వేదికపైనే మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రెండో విడత గొర్రెలను ఇవ్వాలని ప్రశ్నించినందుకు ఇలాంటి పనిష్‌మెంట్ ఏంటి అని చర్చించుకుంటున్నారు. ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.


Next Story

Most Viewed