‘పెద్దమ్మాయిని దత్తత తీసుకొని ఉన్నత చదువులు చదివిస్తా’

by  |
MLA Gongidi Sunitha
X

దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కదిరేనిగూడెం గ్రామంలో తల్లితండ్రులు కోల్పోయి అనాథలైన ముగ్గురు ఆడపిల్లలను శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి పరామర్శించారు. తక్షణ సహాయంగా రూ. 25 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… కదిరేనిగూడెం గ్రామానికి చెందిన నల్లమాస అశోక్ గౌడ్ తాటిచెట్టు పైనుంచి పడి చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో అనాథలైన ఆయన ముగ్గురు ఆడపిల్లల్లో పెద్ద అమ్మాయిని దత్తత తీసుకొని ఉన్నత చదువులు చదివిస్తానని ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి అన్నారు. అంతేగాకుండా.. కుటుంబ సభ్యులు అంగీకరిస్తే మిగతా ఇద్దరి పిల్లలను కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి, వారి భవిష్యత్ బాధ్యతలు కూడా తానే చూస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

మృతుడికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉందని, దీంతో పార్టీ నుంచి వచ్చే బీమా డబ్బులు కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. వీరి సమస్యపై సోషల్ మీడియాలో చూసిన మంత్రి కేటీఆర్ స్పందించి స్వయంగా గ్రామ సర్పంచ్ వేముల పాండుకి ఫోన్ చేసి వివరాలు ఆడిగి తెలుసుకున్నారని, కేటీఆర్ నుండి కూడా సహాయం అందేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అదే గ్రామానికి చెందిన జెట్ట మహేశ్వర్ బాధిత కుటుంబానికి రూ.20వేల చెక్కుతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో చంద్రకళ, ఎంపీపీ పైళ్ల ఇందిరా సత్యనారాయణ రెడ్డి, జెడ్పీటీసీ పల్లా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వేముల పాండు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి జయ, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, పరిసరాల విద్యాభివృద్ధి సంస్థ (నీడ్) డైరెక్టర్ కానుగంటి శ్రీశైలం, గ్రామ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed