‘ట్రబుల్ షూటర్’ పని అయిపోయినట్టే.. ఈటల సంచలన కామెంట్స్

by  |
‘ట్రబుల్ షూటర్’ పని అయిపోయినట్టే.. ఈటల సంచలన కామెంట్స్
X

దిశప్రతినిధి, మెదక్ : నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజానీకానికి తాము వేగు చుక్కల్లా, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తామని.. ఈ రోజు మేము ముగ్గురమే కావొచ్చని, మరో ఆత్మగౌరవ పోరు తప్పదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణలో వికసించేది కమలమే నన్నారు. దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలుపొంది ఏడాది గడుస్తున్న నేపథ్యంలో మొదటి వార్షికోత్సవ సభలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నగరం, పద్మశాలి గడ్డ సర్పంచులతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. వారికి ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. మెదక్ జిల్లాతో నాకు అనుబంధం ఉందన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల ఫలితం తర్వాత ట్రబుల్ షూటర్ కాస్తా ‘ట్రబుల్’ అయిపోయాడని మంత్రి హరీష్ రావును విమర్శించారు. మే 2 నాడు చిల్లర కారణంతో నన్ను బయటకు పంపిండ్రని, బయటకు పంపినప్పుడే నేను బానిసత్వం నుండి విముక్తి పొందనానన్నారు. అధికారంలో లేకపోతేనే సుఖం, శాంతి, సంతోషం లభిస్తుందని, బానిసత్వం, బానిస మనస్తత్వం రెండు లేని వారు దేనికైన సిద్ధంగా ఉంటారని తెలిపారు.

ఈటల రాజేందర్ గతంలో ఎట్ల తమ్ముడు.. ఇప్పుడు ఎట్ల దయ్యం అయ్యిండని ప్రశ్నించారు. దేశానికి చైతన్యం అందించిన గడ్డ తెలంగాణ అని, నీ మోసాలకు త్వరలో చరమ గీతం పాడుతారని సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. రఘునందన్ గెలువడనుకుంటే కర్రు కాల్చి వాతపెట్టారని, దుబ్బాక తెలంగాణకు చైతన్యం తెచ్చిందని, మానవత్వం లేని వ్యక్తి .. మానవ సంబంధాలకే మార్చేసిన వ్యక్తి కేసీఆర్ అని, గతంలో నీవు ఎట్ల ఏడ్చినవో నేను గట్లనే ఏడ్చిన కానీ, నువ్వు బానిసవు అని నేను భరిగీసి కొట్లాడిన అని అన్నారు. అంబేద్కర్ ఇచ్చిన హక్కులను ఎవ్వడు ఆపలేడని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తులు కేసీఆర్, హరీశ్ రావులని అన్నారు.

టీఆర్ఎస్‌కు ప్రశ్నించే హక్కు లేదు..

ధర్నా చౌక్‌ను ఎత్తేసి, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్న కేసీఆర్ సర్కార్‌కు ధర్నాలు చేసే, ప్రశ్నించే హక్కు ఉందా..? అని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. నోట్ల కట్టలతో ఎన్ని ప్రలోభాలు పెట్టినా హుజురాబాద్ ప్రజలు ఆత్మగౌరవానికి పట్టం కట్టారన్నారు. నీ నోట్లకు ఓట్లు వేయమని హుజురాబాద్ ప్రజలు తేల్చి చెప్పారన్నారు. ఒక్క ఈటల గెలుపుతో కేసీఆర్ రోజూ మీడియా ముందుకు వస్తున్నారని, ఈటల గెలుపును దారి మళ్లించడానికి మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ బొక్కబోర్లా పడ్డాడన్నారు. 4వ తేదీ నుంచి దళిత బంధు అమలు అన్నాడు. ఇంతవరకు మొదలు కాలేదని విమర్శించారు. కేసీఆర్ నాటకాలు, మోసాలు, అబద్ధాలు ఇక సాగబోవని తేల్చిచెప్పారు.

-మాజీ మంత్రి డీకే ఆరుణ

నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిని..

రఘునందన్ రావు జీవితం తెరిచిన పుస్తకం అని, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిని అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. కొత్తగా ఆరోగ్య శాఖ చేపట్టిన వ్యక్తి ఉంటాడా? కేసీఆర్ ఆయన్ను జైలుకు పంపుతాడా? చూడాలని మంత్రి హరీశ్ రావు పై వంగ్యాస్త్రాలు విసిరారు. కేసీఆర్ ప్రభుత్వంలో మొదటి ఆరోగ్య మంత్రి రాజయ్య కనిపించకుండా పోయిండని .. ఆ తరువాత లక్ష్మారెడ్డి కనిపిస్తలేడని .. ఈటలను పొగ పెట్టి పంపిండని .. ఇప్పుడు కొత్తగా ఆరోగ్య శాఖ చేపట్టిన వ్యక్తి ఉంటాడా..? జైలుకు పంపుతాడా చూడాలన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించినప్పుడు మైకులు కట్ చేసినప్పుడే మీ పనితీరు తెలుస్తోందన్నారు. గజ్వేల్, సిద్దిపేట లో వంద పడకల ఆసుపత్రి పూర్తి అయింది కానీ, దుబ్బాక ఎందుకు కాలేదో.. ఎవరి చేతగాని తనమో అందరికి తెలుసన్నారు. ముంపు బాధితులకు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మాదిరిగా దుబ్బాకలో కూడా గిరిగిసి నష్టపరిహారం ఇప్పిస్తానన్నారు.

-ఎమ్మెల్యే రఘునందన్ రావు

దుబ్బాక ఎన్నిక చరిత్రను మలుపు తిప్పింది..

దుబ్బాక ఎన్నిక తెలంగాణ చరిత్రలో ఒక మలుపు తిప్పిందని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. ఏడేండ్ల కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొంటుందని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రంపై ఏడ్వటం ఎందుకంటూ విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

-మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి

Next Story

Most Viewed