ప్రకృతిని పరిరక్షించడం మన బాధ్యత : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

by  |
MLA Devireddy Sudhir Reddy
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: కాలుష్య నియంత్రన దినోత్సవాన్ని పురస్కరించుకొని సురక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం స‌రూర్‌న‌గ‌ర్ మినీ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ‘‘వాక్ ఫ‌ర్ పొల్యూష‌న్ ఫ్రీ భార‌త్’’ కార్యక్రమంలో MRDC చైర్మన్‌, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది కాలుష్యంతో ప్రపంచ మానవాళికి జరిగే నష్టాన్ని తెలియజెప్పేందుకే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేను నిర్వహిస్తున్నామ‌న్నారు. పౌరులు కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడేలా వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రకృతిలో మనిషి కూడా ఒక ప్రాణి అని, అయితే, మిగతా వాటికంటే మ‌నిషికి విచక్షణా జ్ఞానం అదనపు వరం అన్నారు. తన సౌఖ్యం కోసం కూర్చున్న కొమ్మను నరుక్కుంటూ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నాడని ఆవేద‌న వ్యక్తం చేశారు.

జీవనాధారమైన గాలి, నీరు, భూమిని కలుషితం చేయడం భవిష్యత్తునే అంధకారంగా మారుస్తోందన్నారు. ప్రకృతి వనరులు సద్వినియోగం చేసుకోవాలని, అంతేగానీ, వాటిని పరిరక్షించాలన్న బాధ్యత విస్మరించకూడదని అన్నారు. అందుకే ప్రతిఒక్కరూ తమ వంతుగా తమ తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు భవాని ప్రవీణ్ కుమార్, ప్రేమ్‌నాథ్ గౌడ్, రమేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు బిచెనేపల్లి వెంకటేశ్వరరావు, వరప్రసాద్ రెడ్డి, తిలక్ రావు, శ్రీధర్ గౌడ్, భాస్కర్, శ్రవణ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు సాయికుమార్, మౌనిక, చరిత, ప్రీతం, సాగర్, అఖిల్, వంశీ, మనీష్, యదా శంకర్, మురళి, కృష్ణ, పలువురు నాయకులు, మహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed