ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మక్తల్ ఎమ్మెల్యే.. చివరకు క్షమాపణ కోరి..!

by  |
ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మక్తల్ ఎమ్మెల్యే.. చివరకు క్షమాపణ కోరి..!
X

దిశ, మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చెట్టెం రామ్మోహన్ రాయుడు మున్సిపల్ కేంద్రంలోని ఛత్రపతి శివాజీ చిత్రపటంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఈ విషయం తెలిసి బీజేపీ నాయకులు మక్తల్ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని లేనియెడల తామెంటో చూపిస్తామని ఎమ్మెల్యేకు హెచ్చరికలు జారీచేశారు.అంతేకాకుండా ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు.

అయితే, మున్సిపల్ కేంద్రానికి వెళ్లిన మక్తల్ ఎమ్మెల్యే అక్కడ ఓ అధికారి చాంబర్‌లో గాంధీ, అంబేద్కర్‌తో ఫొటోల పక్కన ఛత్రపతి శివాజీ చిత్రపటం ఉండటాన్ని గమనించాడు. ఆ మహనీయుల ఫొటో పక్కన ఛత్రపతి శివాజీ చిత్రపటాన్ని తీసివేయాలని అధికారులను ఆదేశించారు. దాని స్థానంలో సీఎం కేసీఆర్ ఫొటో పెట్టాలని అక్కడున్న వారి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి బీజేపీ నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడమే కాకుండా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ది కోసమే ఇలా రాద్దాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

మున్సిపల్ కార్యాలయంలో దేశంలోని మహనీయుల ఫొటోలతో పాటు కేసీఆర్, జయశంకర్ సార్ ఫొటోలు ఏర్పాటు చేయాలని చెప్పానని.. అవే లేనప్పుడు ఈ ఫొటోలు ఎందుకు అన్న కోణంలో చెప్పినట్టు కవర్ చేసుకొచ్చారు.తన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో స్వామి వివేకానంద విగ్రహాలను స్థాపించడానికి సహకారం అందించానని, మందిరాల నిర్మాణం కోసం సొంత డబ్బులతో స్థలం కొనుగోలు చేసి ఇచ్చానని.. అలాంటిది హిందూ సామ్రాజ్యస్థాపకుడు శివాజీ మహారాజ్ గురించి తప్పుడు మాటలు చేయలేదన్నారు. ఒకవేళ మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని.. క్షమాపణ కోరుతున్నట్టు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రాజేష్ గౌడ్, హనుమంతు, కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed