వేములవాడకూ.. ఉప ఎన్నిక?

by  |
వేములవాడకూ.. ఉప ఎన్నిక?
X

దిశ, తెలంగాణ బ్యూరో: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతీయ పౌరసత్వం విషయంలో ఈ నెల 16న హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ అశం మీద బీజేపీ దృష్టి సారించింది. చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఇంకా జర్మనీ పౌరసత్వమే ఉందని, ఆ దేశ పాస్‌పోర్టుపైనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గత నెల 18న స్వయంగా హైకోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ చెన్నమనేని రమేశ్‌ను అనర్హుడని తేలితే ఉప ఎన్నిక తప్పకపోవచ్చని బీజేపీ భావిస్తోంది. అందుకోసం ఇప్సటి నుంచే కసరత్తును ప్రారంభించింది. చెన్నమనేని రమేశ్ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కేంద్ర హోం శాఖ కూడా పూర్తిస్థాయి వివరాలను కోర్టుకు సమర్పించింది. చివరకు కేసు హైకోర్టుకు చేరింది. చెన్నమనేని రమేశ్‌కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం, పాస్‌పోర్టు ఉన్నాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. గతేడాది డిసెంబరు 16వ తేదీన చెన్నయ్ విమానాశ్రయం నుంచి ఆయన జర్మనీ వెళ్లింది కూడా ఆ దేశానికి చెందిన పాస్‌పోర్టు మీదనే అని వివరించింది. భారత పౌరసత్వం కలిగి ఉన్నా అది చెల్లదని కేంద్ర హోంశాఖ అండర్ సెక్రెటరీ గతేడాది నవంబరు 20న లిఖితపూర్వకంగా నివేదించారు. రమేశ్‌కు భారత పౌరసత్వం, పాస్‌పోర్టు కూడా ఉన్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఉత్తర్వులు రద్దు చేయాలని

తనకు జర్మన్ పౌరసత్వం, పాస్‌పోర్టు ఉందని కేంద్ర హోం శాఖ గతేడాది నవంబర్ 20వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని చెన్నమనేని రమేష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనవని, చట్టవిరుద్ధమైనవని అందులో పేర్కొన్నారు. 1955 నాటి సిటిజన్‌షిప్ యాక్ట్ సెక్షన్ 10(3)కు కూడా విరుద్ధమైనవని వివరించారు. అందువల్ల వాటిని కొట్టివేయాలని హైకోర్టును అభ్యర్థించారు. దీని మీద గత నెల 18న జస్టిస్ చల్లా కోదండరెడ్డి విచారణ జరిపారు. రముశ్ కు జర్మనీ పౌరసత్వం, పాస్‌పోర్టు ఇప్పటికీ ఉన్నాయో లేదో ఆ దేశం నుంచి వివరాలను తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయం నుంచి సైతం వివరాలను సేకరించి తదుపరి విచారణ సమయానికి కోర్టుకు సమర్పించాలని సూచించారు. విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని అంశాలను తెర మీదకు తెచ్చింది. ప్రస్తుతం చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, భారత పౌరసత్వం లేకుండా ఎమ్మెల్యే అయ్యే అవకాశమే లేదని వ్యాఖ్యానించింది. లోపాలు ఉంటే అది చాలా సీరియస్ ప్రాధాన్యం ఉన్న అంశం అవుతుందని స్పష్టం చేసింది. కేసు విచారణ జరుగుతూ ఉండగానే రమేశ్ జర్మనీ పాస్‌పోర్టుపైన చెన్నయ్ విమానాశ్రయం నుంచి జర్మనీ వెళ్లారని, కౌంటర్ అఫిడవిట్‌లో మాత్రం ఈ అంశాన్ని పేర్కొనలేదని న్యాయమూర్తి గుర్తు చేశారు.

స్సష్టత రావాలి

ఇలాంటి పరిస్థితులలో రమేశ్ పౌరసత్వానికి సంబంధించిన స్పష్టత రావాల్సి ఉందని బెంచ్ అభిప్రాయపడింది. పిటిషనర్ తన జర్మనీ పాస్‌పోర్టును సరెండర్ చేశారా? భారత దేశం నుంచి పాస్‌పోర్టును పొందారా? లేదా కూడా తేలాలని పేర్కొంది. పిటిషనర్ ఈ అంశాలను అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలియజేయాలని, జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్న విషయాన్ని ధ్రువీకరించే పత్రాలను కూడా సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలో వేములవాడకు ఏ క్షణమైనా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని భావిస్తున్న బీజేపీ గెలవడం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వం విషయంలో మొదటి నుంచీ కొట్లాడుతున్న ఆది శ్రీనివాస్ తొలుత కాంగ్రెస్ (2009లో పిటిషన్ వేసే సమయానికి) పార్టీకి చెందినవారే అయినా ఆ తర్వాత బీజేపీలో చేరారు. తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ గూటికి వచ్చారు. ఇప్పటికే నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ వేములవాడపై కూడా కన్నేసింది.

Next Story