‘మిషన్ భగీరథ’ అధికారులపై ఎమ్మెల్యే చల్లా ఆగ్రహం

by  |
‘మిషన్ భగీరథ’ అధికారులపై ఎమ్మెల్యే చల్లా ఆగ్రహం
X

దిశ, పరకాల: నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నడికూడ, పరకాల మండలాలకు చెందిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సర్పంచ్, ఎంపీటీసీలతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలు, పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులపై గ్రామాల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పనులు కొన్ని గ్రామాలలో ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేయాలి, ప్రతి ఇంటికి నల్లా బిగించాలని అన్నారు. శ్మశాన వాటికల నిర్మాణాలు కూడా పూర్తిస్థాయిలో చేయాలన్నారు.

గ్రామ పంచాయతి సిబ్బందిని గ్రామంలో అన్ని పనుల్లో వినియోగించుకోవాలని, కారోబార్, ట్రాక్టర్ డ్రైవర్, పంప్ ఆపరేటర్ లంటూ ఇంకా కొంతమంది అలాగే కొనసాగుతున్నారని అది సరైంది కాదన్నారు. మల్టీ పర్పస్ వర్కర్ గా గుర్తించి అందరినీ అన్ని పనులు చేసేలా పురమాయించాలని కార్యదర్శులకు సూచించారు. గ్రామ అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. పల్లె ప్రగతిలో గ్రామాలలో గుర్తించిన ప్రతి పని పూర్తి చేయాల్సిందేనన్నారు. ప్రతి గ్రామంలో 100 శాతం వాక్సినేషన్ పూర్తయ్యేలా మెడికల్ ఆఫీసర్లు చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు పల్లె ప్రగతిలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదన్నారు. ఇప్పటికైనా వాటిని పూర్తిచేయాలని సూచించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి

అందరూ సమన్వయంతో కలిసి పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పరకాల పట్టణంలో విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణాల పట్ల టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు అంటూ నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు,వివిధ శాఖల మండల, గ్రామ స్థాయి అధికారులు, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు, ఏపీఎం, ఏపీఓ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed