పత్తి కొనుగోళ్లపై కీలక నిర్ణయం.. బహిరంగ వేలం ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా

by  |
MLA Challa Dharma Reddy
X

దిశ, పరకాల: పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇకనుంచి బహిరంగ వేలం ద్వారా పత్తి కొనుగోలు చేయనున్నట్లు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం తెలియజేసింది. ఈ కార్యక్రమానికి సోమవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ పత్తి కొనుగోలు వేలం పాటలో మొదటిసారి రూ.7810/- ధర పలికింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరకాల వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.73 లక్షలతో ప్రహారిగోడ నిర్మాణం, రూ.26 లక్షలతో 4000 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణం, రూ.15 లక్షలతో టాయిలెట్ నిర్మాణం, రూ.84 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.

అంతేగాకుండా.. సబ్ మార్కెట్ యార్డ్‌లో రూ. 28 లక్షలతో ఓపెన్ షెడ్, నాబార్డ్ గోదాం చుట్టూ రూ.52 లక్షలతో సీసీ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నూతన పాలకవర్గం ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు అభినందించారు. ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్లో పత్తి ధర ఎక్కువ ఉన్నందున, సీసీఐ కొనుగోళ్లు లేనందున మార్కెట్ యార్డ్‌లో వ్యాపారుల ద్వారా బహిరంగ వేలంలో రైతులకు మంచి ధర ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభానికి కృషి చేస్తామన్నారు. వరంగల్ మార్కెట్లో లేని ధర పరకాల మార్కెట్లో ఉందని, దీనిని రైతులంతా గమనించాలని కోరారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు మార్కెట్ శాఖ వారు ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ పాలకవర్గం, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed