ఇదో డిఫరెంట్ ఎన్నికల ప్రచారం గురూ..

by  |
ఇదో డిఫరెంట్ ఎన్నికల ప్రచారం గురూ..
X

దిశ, మహబూబాబాద్ : ప్రస్తుతం అన్ని రంగాల్లో టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. అందరూ డిజిటల్ మీడియా వైపు పరుగులు తీస్తున్నారు. అయితే రాజకీయ నాయకులు సైతం ఎన్నికల సమయంలో టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు. వారి లక్ష్యాలను చేరుకోవడం కోసం డిజిటల్ రంగంలో దూసుకపోతున్నారు. ప్రచారం కోసం సోషల్ మీడియాను విపరీతంగా యూస్ చేసుకుంటున్నారు. ఇదంతా మనకు తెలిసిందే.

కానీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వినూత్న సంఘటన అందరినీ అబ్బురపరిచింది. కేసముద్రం మండలంలో ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని టీఆర్ఎస్ శ్రేణులు స్థానిక లక్ష్మీ సాయి గార్డెన్స్‌లో సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టారు. పార్టీ శ్రేణులు, పట్టభద్రులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య నేతలంతా వేదికపై కూర్చున్నారు.

అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ రావాల్సి ఉంది. కానీ, హఠాత్తుగా పార్టీ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సాగర్‌కు వెళ్ళారు. చివరి నిమిషం వరకు ఎమ్మెల్యే రాకపోవడంతో అక్కడ ఉన్న వారు సెల్ ఫోన్ ద్వారా మైక్‌లో ఎమ్మెల్యేతో పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడించారు. ఆయన తన ప్రసంగాన్ని10 నిమిషాల పాటు కొనసాగించగా పార్టీ శ్రేణులు, పట్టభద్రులు కేరింతలు, చప్పట్లతోఉత్సాహంలో మునిగిపోయారు.

Next Story

Most Viewed