ప్రగతిభవన్​ సాక్షిగా.. ‘హైదరాబాద్​ స్టేట్​’.. ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్

by  |
ప్రగతిభవన్​ సాక్షిగా.. ‘హైదరాబాద్​ స్టేట్​’.. ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ చైర్మన్​గా పదవి దక్కిందనే సంబురమో.. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ సంస్థకు తాను చైర్మన్​ అనే భయమో.. మొత్తానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ కొత్త వివాదంలో కూరుకున్నారు. సొంతంగా.. తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విషయాన్నే మరిచిపోయాడు. టీఆర్​ఎస్​ పాలనను మరిచిపోయాడో.. నిజాం పాలనలో ఉన్నట్లు అనిపించిదేమో కానీ ఆయన పేరుతో ముద్రించిన ఫ్లెక్సీల్లో హైదరాబాద్​ రాష్ట్రంగా పేర్కొనడంపై మండిపడుతున్నారు. అక్కడో.. ఇక్కడో కాదు.. ఏకంగా ప్రగతిభవన్​ ముందే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మరో విశేషం. ఉన్నతస్థాయి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తచ్చాడే ప్రగతిభవన్​ ముందు హైదరాబాద్​ రాష్ట్రంగా చెప్పుకుంటూ ఆర్టీసీ చైర్మన్​గా ఇటీవల నియమితులైన నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలిసి చర్చగా… రచ్చగా మారిన ఈ ఫ్లెక్సీలు సోమవారం సాయంత్రం 6 గంటల వరకు కూడా మార్చలేదు. అయితే వివాదంగా మారడం.. మరింత ముదురుతుండటంతో ఎట్టకేలకు జీహెచ్​ఎంసీ సిబ్బందితో ఈ ఫ్లెక్సీలను తొలిగించివేశారు.

నిజాం పాలన గుర్తుకు వచ్చిందా..?

బాజిరెడ్డి గోవర్ధన్​ ఫ్లెక్సీలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. కేసీఆర్​ పాలన నిజాం పాలనను మరిపిస్తుందనే భ్రమతో గోవర్ధన్​ ఉన్నారంటూ సోషల్​ మీడియాలో చర్చ పెట్టుతున్నారు. ఇలాంటి నేతలకు సీఎం కేసీఆర్​ పదవులు ఇస్తున్నాడని, ఉద్యమం చేసి, తెలంగాణ కోసం కొట్లాడిన వారిని దూరం పెడితే ఇలాగే నవ్వులపాలు కావాల్సి వస్తుందంటూ సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ ఫ్లెక్సీలు ఆయన అభిమానులు పెట్టినా ఇంత పెద్దగా చర్చ జరిగేది కాదని పార్టీ వర్గాలే అంటున్నాయి. స్వయంగా బాజిరెడ్డి గోవర్ధన్​ పేరుతోనే ఏర్పాటు చేయడం, అందులో హైదరాబాద్​ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్​ చైర్మన్​గా చెప్పుకోవడం వివాదమైంది. ఉదయం నుంచి ఈ ఫ్లెక్సీలు ప్రగతిభవన్​ ఎదుట దర్శనమిచ్చినా.. గులాబీ నేతలు, ప్రజాప్రతినిధులు లైట్​గా తీసుకున్నారు. కానీ సాయంత్రం నుంచి సోషల్​ మీడియా వేదికగా దీనిపై విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో వీటిని పార్టీ నేతలు ముట్టుకోకుండా.. జీహెచ్​ఎంసీ కార్మికులతో తొలిగించారు. అయితే ఫ్లెక్సీలకు ఫైన్లు వేసే జీహెచ్​ఎంసీ.. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్​ హోదాలో ఏర్పాటు చేసిన వీటిపై ఇంకా స్పందించడం లేదు. కనీసం జరిమానా అయినా వేస్తారా.. లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.


Next Story

Most Viewed