దళిత మహిళా ఎంపీపీపై ఎమ్మెల్యే దాడి

by  |
దళిత మహిళా ఎంపీపీపై ఎమ్మెల్యే దాడి
X

దిశ, రంగారెడ్డి: ముచ్చర్ల ఫార్మాసీటీ కోసం నిర్మిస్తున్న రోడ్డు పనుల శంకుస్థాపనలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ మధ్య వివాదం చెలరేగింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి వద్ద రూ.23 కోట్లతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీపీ సుకన్య ఆ కార్యక్రమం వద్దకు చేరుకున్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం చేయడం ఏంటనీ ఎమ్మెల్యేను నిలదీశారు. ఆమె మాటలు లెక్కచేయకుండా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కొబ్బరకాయ కొట్టబోయాడు. ఈ క్రమంలో రాయిపై కొబ్బరికొడుతుండగా ఎంపీపీ తన చేతిని అడ్డం పెట్టారు. అలాగే ఆమె చేతిపై ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. దీంతో వివాదం ముదిరిపోయింది. ఈ క్రమంలో ఆమెను మహిళా పోలీసులు పక్కకు లాక్కెళ్లారు. అనంతరం ఆమె తమ బీజేపీ పార్టీ కార్యకర్తలతో కలిసి అక్కడే ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అక్కడికి చేరుకున్నారు. మహిళా ఎంపీపీపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై ఎస్పీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీపీ సుకన్య మాట్లాడుతూ.. స్థానిక ఎంపీపీకి సమాచారం ఇవ్వకుండా శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారని, మహిళాఎంపీపీ అనే గౌరవం లేకుండా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీపీని అగౌరపరిచేలా ఎమ్మెల్యే వ్యవరిస్తున్నారని తెలిపింది. అధికారులను వేధించి తనకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఎంపీపీని కావడంతోనే అగ్రవర్గానికి చెందిన ఎమ్మెల్యే దాడి చేశారని ఆమె ఆరోపించారు.

నేను భౌతికంగా దాడి చేయలేదు: కిషన్‌రెడ్డి

‘నేను కొబ్బరికాయ కొడుతుండగా రాయిపైన ఎంపీపీ చేయి పెట్టారు. నేనేమి ఆమెపై భౌతికంగా దాడి చేయలేదు’ అని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Next Story

Most Viewed